
మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదే
నవాబుపేట: మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. చాలా మంది రైతులు ప్రస్తుతం ఈ పంట సాగులో బిజీగా ఉన్నారు. సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మంచి లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి జ్యోతి సూచిస్తున్నారు. నవాబుపేట మండలంలో ఈ ఖరీప్లో 27,234 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయలు తదితర పంటలు సాగుకానున్నాయి. అందులో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగనుందని అధికారులు తెలుపుతున్నారు. గతేడాది మండలంలో 744 ఎకరాల్లో సాగయింది. ఈసారి మాత్రం 2317 ఎకరాలకు పెరగనుందని అంచనా. మొక్కజొన్న సాగులో పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలపై అధికారులు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
నేలలు
సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు భూములు, నీరు నిల్వ ఉండేవి ఈ పంటకు అనుకూలించవు. విత్తుటకు ముందు మూడు–నాలుగు సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.
విత్తేకాలం
సాధారణ పరిస్థితుల్లో వర్షాదారపు పంటను జూన్ 15 నుంచి జులై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. మొదలు నాగలితో బోదెలు చేసుకోవాలి. తర్వాత విత్తనాన్ని బోదెకు పైనుంచి 1/3 వంతు ఎత్తులో విత్తితే నీటి పారుదల సులభంగా ఉండడమే కాకుండా వర్షాపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది.
కలుపు యాజమాన్యం
పంట విత్తిన తర్వాత రెండు, మూడు రోజులలోపు అట్రజిస్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు పిచికారీ చేయాలి. బరువు నేలలో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను ఒక నెల వరకు అదుపు చేయవచ్చు. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే 2, 4–డి సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది.
నీటి తడులు
మొక్కజొన్న పూతకు ముందు, పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం. 30–40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేనులో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6–8 నీటి తడులు అవసరం. విత్తనాలు వేసినప్పుడు, విత్తిన 15 రోజులకు, తదితర దశల్లో నీటి తడులను తప్పకుండా ఇచ్చేలా జాగ్రత్త పడాలి. దీర్ఘకాలిక వంగడాలను 1–2 తడులు అధికంగా అవసరమవుతాయి.
కాండం తొలుచు పురుగులు
ఇవి రెండు రకాలు. మచ్చల, చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీప్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఎక్కువగా రబీలో ప్రభావం చూపుతుంది. ఇవి పైరు మొలకెత్తిన 10–20 రోజులకు సోకుతాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్ర హరితాన్ని గోకి తింటాయి. తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు, పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కలిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల పువ్వు చనిపోయి ఎండిపోతుంది. దీనినే డెడ్హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిణి ఆశించడంతో దిగుబడి తగ్గతుంది.
రసం పీల్చు పురుగులు
30 రోజులు పైబడిన పైరును పేనుబంక, చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. లేత కాండం నుంచి రసాన్ని పీల్చడంతో ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే జిగునరు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది.
నివారణ
సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిడ్స్ వంటి పరాన్నజీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చు పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొనోక్రోటోపాస్ ఎకరాకు 320 మి.లీ లేదా డైమిథోయేట్ కలిపి పిచికారీ చేయాలి.
టర్సికమ్ ఆకు తెగులు
ఆకులపై పొదవైన, కోలాకారపు బూడిద రంగుతో ఆకుపచ్చ, గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు 2.5 నుంచి 25 సెం.మీ. పొడవు, 4 సెం.మీ. వెడల్పు ఉంటాయి. ఈ మచ్చలు మొదట మొక్క కింద ఆకులపై కనిపించి, క్రమంగా పెద్దవై వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు అంతా ఎండి మొక్కలు చలిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకుల అడుగు బాగాన వలయాలుగా ఉంచాయి. ఈ మచ్చలు కాండంపైనా వ్యాపిస్తాయి.
తుప్పు తెగులు
నల్ల రేగడి, ఎర్ర నేలలు అనుకూలం
యాజమాన్య పద్ధతులు పాటిస్తే మేలు
నవాబుపేట ఏఓ జ్యోతి
ఆకులపై రెండు వైపులా గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కుల మాదిరిగా తెగులు లక్షణాలు కనిపిస్తాయి. పంట పెరిగిన కొద్ది ఆకులపైన పొక్కులు గోధుమ వర్ణం నుంచి నలుపు వర్ణానికి మారుతాయి. ఉద్ధృతి, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పై రెండు రకాల తెగుళ్ల నివారణకు మాంకోజెట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి ఒకటి లేక రెండుసార్లు పిచికారీ చేయాలి.

మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదే