
ప్రభుత్వ భూములను కాపాడండి
మొయినాబాద్ రూరల్: మండలంలోని తోల్కట్ట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు. ఎక్స్ సర్వీస్మెన్ల పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. కొంతమంది బడాబాబులకు అసైన్డ్ పట్టాలు, పాసు పుస్తకాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. పేదలు సాగు చేసుకునేందుకు మాత్రం అనుమతించడం లేదని మండిపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకే సర్వే నంబర్లోని భూమిని ఇద్దరు సోదరుల్లో ఒకరికి పట్టా చేసి, మరొకరికి లావణి పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. భూ భారతిలోనైనా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో గ్రామస్తులు భిక్షపతి, జంగయ్య, మల్లయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు.
రెవెన్యూ సదస్సులో తోల్కట్టవాసుల వినతి