
అటవీ భూమి కబ్జా
బషీరాబాద్: మండలంలోని మైల్వార్ రిజర్వుడు ఫారెస్టులో 5 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. నీళ్లపల్లి ఫారెస్టు సెక్షన్లోని సర్వేనంబర్ 20లో ఇస్మాయిల్పూర్ తండాకు చెందిన బలరాం నాయక్, రెడ్యానాయక్, భీమ్లానాయక్ గుట్టుచప్పుడు కాకుండా విత్తనాలు నాటారు. విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఫారెస్టు సెక్షన్ అధికారి స్నేహశ్రీ, బీట్ అధికారి మల్లప్ప గురువారం అక్కడికి చేరుకొని కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే భూమి విషయం కోర్టులో కేసునడిచింది. కొన్ని నెలల తర్వాత అవీ అటవీ భూములేనని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వ్యవసాయ అధికారులు గుర్తు చేశారు. అటవీ భూములు కబ్జా చేసి సాగు చేయడం చట్టరీత్య నేరమన్నారు. వెంటనే ఆ భూముల్లో గోతులు తీయించారు. త్వరలో మొక్కలు నాటుతామని అధికారులు తెలిపారు.
రైతుల వాగ్వివాదం..
కబ్జాకు గురైన భూమిని స్వాధీనానికి వెళితే సాగు చేసిన రైతులు వారిపై గొడవకు దిగారు. తాము ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నామని తమ భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అధికారులు కేసులు పెడుతామని హెచ్చరించడంతో రైతులు వెనుకంజ వేశారు.
● ఇస్మాయిల్పూర్లో 5 ఎకరాల్లో విత్తనాలు నాటిన రైతులు
● అడ్డుకున్న ఫారెస్టు అధికారులు
● ఆందోళనకు దిగిన అన్నదాతలు