
బడిబాటకు సన్నద్ధం
● రేపటి నుంచి 19 వరకు కార్యక్రమాలు
● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల
పెంపే లక్ష్యంగా ముందుకు..
దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉపాధ్యాయులు బడిబయట బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై ప్రచారం చేయనున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కూడా ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలపై సమ్మకం పెంచేలా..
మండల వ్యాప్తంగా 45 ప్రభుత్వ పాఠశాలలు ఐదు ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 4,800 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను 20శాతం పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సర్కారు బడులపై ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించి నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయనున్నారు. నాణ్యమైన విద్య, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, భోజన వసతి వంటి వాటి గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేనున్నారు. అలాగే సాధించిన ఫలితాల గురించి వివరించనున్నారు.
విజయవంతం చేస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉంటారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేస్తారు. అలాగే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, భోజన వసతి ఉంటుంది. వీటన్నింటినీ బడిబాట కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తాం. తద్వారా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తాం.
– వెంకటస్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్