
వణుకెందుకు బాబు?
● ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం రావడం ఖాయం ● మామిడి రైతులకు అండగా నిలవడం తప్పా? ● హెలీప్యాడ్కు కూడా అనుమతివ్వకుండా ఆంక్షలా? ● మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఇలా..
ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారని తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మొగసాల రెడ్డెప్ప, హేమంత్కుమార్ రెడ్డి, ఎస్డీ మురళీకృష్ణ, చెంగారెడ్డి, దయానంద్గౌడ, కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పలమనేరు: ‘ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తే కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దేనికని?. అంత బెదురెందుకని..’ అంటూ రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మామిడికి గట్టుబాటు ధర కోసం ఈనెల 9న బంగారుపాళెంకు వస్తున్న సందర్భంగా పలమనేరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా నేతలతో ఆయన శనివారం సన్నాహక సమావేశాన్ని నేర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు.ఇప్పటికే పొగాకు, మిరప, టమాట రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వాపోయారు. ఇప్పుడు మామిడి రైతులు కూడా ఆ కోవలో చేరారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడిని అమ్ముకోలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతమన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో రైతులకు అక్కడి ఎంపీ కేంద్రానికి లేఖ రాసి వారిని ఆదుకున్న విషయం తెలిసిందేనన్నారు. కానీ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు ఇక్కడి మామిడి రైతుల కష్టాన్ని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.
హెలీప్యాడ్కు అనుమతులివ్వడం లేదు
ప్రతిపక్ష నేతగా మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటకు హెలీప్యాడ్కు సైతం అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. అసలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికై నా వస్తున్నారంటే కూటమి ఎందుకు అంతలా వణికిపోతోందే అర్థం కావడం లేదన్నారు. మొన్నటి దాకా తోతాపురికి ధరలేక కాయలు అమ్ముకోలేక తోటల్లో వదిలేస్తున్నా పట్టించుకోని సీఎం ఇప్పుడు జగన్మోహన్రెడ్డి వస్తున్నాడని తెలిసి మామిడిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే జగన్ వస్తేగానీ రైతుల కష్టం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు.