దుబాయ్‌ స్టీలు.. అంచనా పెంచేసింది  | Stainless Steel Construction Telangana Martyrs Memorial Building At Lumbini Park Hyderabad | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ స్టీలు.. అంచనా పెంచేసింది 

May 31 2022 1:53 AM | Updated on May 31 2022 1:53 AM

Stainless Steel Construction Telangana Martyrs Memorial Building At Lumbini Park Hyderabad - Sakshi

షికాగోలోని బీన్‌ శిల్పం

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా అలాంటివి రెండే నిర్మాణాలున్నాయి.. మూడోది హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటోంది. అమెరికాలోని షికాగోలో 2006లో రూపొందిన ‘ది బీన్‌’శిల్పం మొదటిది కాగా, చైనాలోని జింగ్‌జియాన్‌ రీజియన్‌లో 2015లో ‘ది ఆయిల్‌ బబుల్‌’శిల్పం రెండోది. ఈ రెండింటి కంటే కొన్ని రెట్లు పెద్దదిగా ప్రమిద ఆకృతిలో రూపుదిద్దుకుంటున్నదే హైదరాబాద్‌లోని ‘అమరవీరుల స్మారక భవనం’. అద్దంలో కనిపించినట్టుగానే ఎదుటి ప్రాంతం ప్రతిబింబిస్తుంది.

ఇది నునుపుగా ఉండే 60 వేల చదరపు అడుగుల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇందులో అతుకుల్లేని విధంగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ప్యానెల్స్‌ను అమరుస్తారు. దాదాపు 48 అడుగుల ఎత్తుతో ఉం డే ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంటుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తెలంగాణ అమరవీరులను స్మరించుకునేలా.. వెలుగుతున్న ప్రమిద ఆకృతిలో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణం దేశంలోనే ఆ తరహా కట్టడాల్లో మొదటిది.

హైదరాబాద్‌ పర్యాటకులకు గొప్ప అనుభూతిని పంచేలా ఇది రూపొందుతోంది. అన్నీ కుదిరితే వచ్చే దసరా నాటికి ఇది ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇప్పుడు కట్టడం చుట్టూవాడే స్టెయిన్‌లెస్‌ స్టీలు ప్యానెల్స్‌ వ్యయాన్ని కంపెనీ భారీగా పెంచేసింది. రూ.140 కోట్లలోపు వ్యయంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రూ.177 కోట్లను దాటబోతోంది.  


అమెరికా తరహాలో చైనాలోని ఆకృతి 

ఇదీ సంగతి... 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర అమరవీరులదే. అందుకే వారి స్మృత్య ర్థం ఓ స్మారకాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధా రణ నిర్మాణంగా కాకుండా ప్రత్యేకంగా ఉం డాలని భావించింది. దీంతో రకరకాల డిజైన్ల ను పరిశీలించి చివరకు వెలుగుతున్న ప్రమిద నమూనాను ముఖ్యమంత్రి ఎంపిక చేశారు.

అయితే ఆ డిజైన్‌కు అతుకుల్లేని విధంగా చుట్టూ స్టెయిన్‌లెస్‌ స్టీలు ప్యానెల్స్‌ను వినియోగించే విషయంలో డిజైన్‌ రూపొందించిన సంస్థ స్ట్రక్చరల్‌ ఇంజనీర్, పనులు నిర్వహించే యంత్రాంగానికి మధ్య సమన్వయం కొరవడింది. నిర్మాణం తర్వాత చుట్టూ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తారని భావించి, దానికి రూ.5 కో ట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేసుకున్నారు.

స్థానికంగానే దాన్ని రూపొందిస్తారని అధికారులు భావించారు. అయితే, అది అతుకుల్లేకుండా కనిపించేవిధంగా, వాతావరణ మార్పులకు వెలసిపోకుండా, పెద్ద పెద్ద పక్షు లు వాలినప్పుడుగానీ, ఇతర పరిస్థితుల్లోగానీ ఎలాంటి గీతలు పడకుండా, సొట్టలు పడ కుండా ఉండేటట్టు ప్రత్యేక రోబోటిక్‌ కటింగ్, లేజర్‌ బెండింగ్‌ పద్ధతిని అనుసరించాల్సి రావడంతో వ్యయం భారీగా పెరిగింది. 

దుబాయ్‌ కంపెనీతో ఒప్పందం 
చైనాలో ఆ విధమైన ఆధునిక పరిజ్ఞానం ఉందని అధికారులు మొదట గుర్తించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో ఒప్పందం చేసుకునే వీలు లేకపోవటంతో ఓ దుబాయ్‌ కంపెనీని సంప్రదించారు. ముఖ్యమంత్రి ఆ మోదం పొందిన డిజైన్‌ కావటంతో దానిలో మార్పులు చేసేందుకు అధికారులు జంకా రు. గ్లాస్‌ ప్యానెల్స్, అల్యూమినియం ప్యానెల్స్‌తో చేయిస్తే సాధారణ ఖర్చులోనే ముగిసేది.

కానీ, ఈ స్తూపం నిర్మాణంలో ప్రత్యే కంగా 4 ఎంఎం గేజ్‌తో ప్రత్యేక స్టీల్‌నే వాడా ల్సి వచ్చింది. సంబంధిత దుబాయ్‌ కంపెనీతో మాట్లాడాక కంగుతినటం అధికారుల వంతైంది. దాదాపు రూ.40 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి రావటమే దానికి కారణం. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ కంపెనీతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం అంతమేర పెరిగిపోవాల్సి వచ్చింది.

ఇప్పు డు ఆ స్టీల్‌ను అక్కడే ప్రమిద ఆకృతికి తగ్గట్టుగా పలు ప్యానెల్స్‌గా కట్‌ చేసి, వాటికి గీతలు, సొట్టలు పడని విధంగా ప్రత్యేక కంటెయినర్లలో ఉంచి దుబాయ్‌ నుంచి తెప్పిస్తున్నారు. మొత్తం 23 కంటెయినర్లలో ఐదు కంటెయినర్లు మన దేశానికి చేరుకున్నాయి. ఇందులో రెండు కంటెయినర్లు పనిజరుగుతున్న చోటికి రాగా, మిగతా మూడు డ్రైపోర్టులో ఉన్నాయి. మిగతావి మరో మూడు నెలల్లో ఇక్కడికి రానున్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement