క్లుప్తంగా
తిరువొత్తియూరు: ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాంచీపురంలో వెలిసిన ఏకాంబరనాథర్ ఆలయంలో డిసెంబర్ 8వ తేదీన మహా కుంభాభిషేకం జరగనుంది. ప్రస్తుతం కుంభాభిషేకానికి సంబంధించిన చివరి దశ పనులైన యాగశాల మండపం ఏర్పాటు, ఆలయ ప్రాంగణ మరమ్మతులు, భక్తుల కోసం సౌకర్యాలు కల్పించడం వంటి పనులు పూర్తి వేగంతో జరుగుతున్నాయి. శివగంగై తీర్థకుళం పక్కన ఏర్పాటు చేస్తున్న నవకుండ యాగశాల మండపం, 70 హోమ గుండాలు ఏర్పాటు పనులపై తమిళనాడు ప్రధాన పర్యవేక్షణ, కార్యనిర్వాహక ఇంజినీర్ దామోదరన్ నేతృత్వంలోని అధికారులు, హిందూ మత ,ధర్మాదాయ శాఖ అధికారులు కలిసి తనిఖీ చేశారు. కుంభాభిషేకం సమయంలో దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన ప్రాథమిక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను చేపట్టుటకు అధికారులకు సూచించారు. ఆలయ గోడల మరమ్మతులు, నల్లరాళ్లు పరచడం, పురాతన విగ్రహాలకు పర్యావరణ అనుకూల రంగులు వేయడం, రాజగోపురం మూలవర్ సన్నిధి సహా వివిధ సన్నిధులలోని గోపురాలపై కలశాలు ఏర్పాటు చేయడం వంటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
తిరువొత్తియూరు: చైన్నె మాధవరం ప్రాంతంలో అనుమానాస్పదంగా వస్తున్న కారును అడ్డుకోగా డ్రైవర్ పరారైన పరిస్థితిలో, ఆ కారు నుంచి సుమారు 265 కిలోల నిషేధిత గుట్కా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాలు.. చైన్నె మాధవరం పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు గత 20వ తేదీ సాయంత్రం మాధవరం సీఎండీఏ లారీ పార్కింగ్ వెనుక వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో దారి గుండా వచ్చిన ఒక కారును అనుమానంతో పోలీసులు అడ్డగించారు. పోలీసులను చూసిన డ్రైవర్, కారును రోడ్డు పక్కన ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు, ఆ కారును పూర్తిగా తనిఖీ చేశారు. కారు లోపల 265 కిలోల గుట్కా ప్యాకెట్లు దాచి ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ కుమార్ (18), హక్కం సింగ్ (30) అని తెలిసింది. వారిని శనివారం పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్పేటలోని ఫిట్జీ గ్లోబల్ పాఠశాలలో తొమ్మిది ప్రపంచ రికార్డులు, 16 వ్యక్తిగత ప్రపంచ రికార్డుల కోసం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాఠశాల ప్రిన్సిపల్ పొంగల్ పునిత గత నెల 15వ తేదీన ప్రారంభించారు. అప్పటి నుంచి వేలూరులో 25 ప్రపంచ రికార్డులను సృష్టించి జిల్లాలోనే మొదటి పాఠశాలగా ఫిట్జీ గ్లోబల్ పాఠశాలగా నిలిచింది. దీంతో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ఇందులో 16 వ్యక్తిగత ప్రపంచ రికార్డులను విజయవంతంగా పూర్తి చేసి ఎలైట్ రికార్డ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను గుర్తించాయన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ప్రిన్సిపల్ పొంగల్ పునిత, వైస్ ప్రిన్సిపల్ నిశాంత్ త్రిపాఠి, అంకుర్ కుమార్ జైన్, రాహుల్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా సాధించిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులకు క్రమశిక్షణ, కళ, సంస్కృతి, సంప్రదాయంపై దృష్టి సారిస్తుందన్నారు. విద్యార్థులను సమాజానికి మంచి పౌరులుగా అంకితం చేస్తామన్నారు.
తిరువొత్తియూరు: నాగర్కోయిల్లో ఓ బ్యూటీషియన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగర్కోయిల్ వెట్టూర్ణిమడం పరమార్థ లింగపురం ప్రాంతానికి చెందిన మైఖేల్ జేవియర్. ఇతని భార్య శోభా. వీరి కుమార్తె లివినా (21) బీఎస్సీ కంప్యూటర్ సైన్న్స్ చదివింది. ప్రస్తుతం ఈమె పెరువిళైగంగానగర్ మొదటి వీధిలో ఉంటోంది. లివినా బ్యూటీషియన్గా పని చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు మైఖేల్ జేవియర్, శోభా ఇద్దరూ బయటకు వెళ్లి ఉన్నారు. ఇంట్లో లివినా మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆమె ఫ్యాన్న్కు ఉరి వేసుకుంది. ఇది చూసి ఆమె స్నేహితులు లివినాను ఆశారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. చనిపోయినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్లుప్తంగా


