
పొగ కమ్మి 8 మందికి అస్వస్థత
తిరువొత్తియూరు: గిండిలోని ఒక హాస్టళ్లలో జనరేటర్ నుంచి పొగలు వచ్చి, ఆ ప్రాంతంలో కమ్ముకోవడంతో ఎనిమిది మంది స్పృహ కోల్పోయారు. చైన్నె గిండి కత్తిపార జీఎస్టీ రోడ్ ఉన్న హాస్టల్లో రాత్రి 11 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హాస్టల్కు జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఆన్ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జనరేటర్ నడుస్తుండగా పొగలు వచ్చి హాస్టల్ అంతటా వ్యాపించాయి. దీంతో హాస్టల్లోని ఎనిమిది మంది ఊపిరాడక స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న సెయింట్ థామస్ మౌంట్ పోలీసులు గిండి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న వారిని రక్షించి, వెంటనే చికిత్స కోసం గిండిలోని కలైంజర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సెయింట్ థామస్ మౌంట్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
వివాహ ముందస్తు భత్యం
రూ. 5 లక్షలకు పెంపు
అన్నానగర్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వివాహానికి ముందు ఇచ్చే భత్యాన్ని రూ.5 లక్షలకు పెంచారు. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి పిల్లల వివాహాలకు ప్రభుత్వం ముందస్తు చెల్లింపును అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వివాహానికి ముందు ఇచ్చే భత్యం రూ. 5 లక్షలకు పెంచుతామని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శాసనసభ చివరి బడ్జెట్ సమావేశంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆర్థిక కార్యదర్శి ఉదయచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి 15 నెలల మూల వేతనం లేదా రూ. 5 లక్షలు, ఏది తక్కువైతే దానికి సమానంగా ఉంటుంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల ముందు వరకు ఉన్న ఉద్యోగులు ముందస్తు చెల్లింపు పొందవచ్చు. భర్త, భార్య లేదా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ, ప్రతి కుటుంబానికి ఒకసారి మాత్రమే ముందస్తు చెల్లింపును పొందవచ్చని మార్గదర్శకాలు జారీ చేశారు.
యువకుడికి దేహశుద్ధి
అన్నానగర్: ఓ యువతి స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసిన యువకుడికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన కలకలం రేపింది. తిరుప్పూర్లోని అంగేరిపాళయం ప్రాంతంలో బుధవారం ఉదయం తన ఇంట్లోని బాత్రూంలో ఒక యువతి స్నానం చేస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక యువకుడు దాక్కుని ఆ యువతి స్నానం చేస్తున్న దృశ్యాలను తన సెల్ఫోన్తో వీడియో తీశాడు. అకస్మాత్తుగా శబ్దం విన్న యువతి కేకలు వేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారి పోయాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న యువకులు, ప్రజలు ఆ యువకుడిని వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. విచారణలో అతను బీహార్కు చెందినవాడని తేలింది. అనంతరం అతన్ని అనుప్పర్ పాళయం పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
వ్యభిచారం కేసులో
మహిళ అరెస్టు
అన్నానగర్: మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె వ్యభిచార నివారణ యూనిట్–2 ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని పోలీసులు సైదాపేటలోని మసుది పల్లం రెండో వీధిలో ఒక ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. పశ్చిమ సైదాపేట ప్రాంతానికి చెందిన భువనేశ్వరి(53) అనే సెక్స్ బ్రోకర్ ఇద్దరు యువతులతో సెక్స్వర్క్లో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు భువనేశ్వరిని అరెస్టు చేశారు. ఆమె సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు యువతులను రక్షించి, ప్రభుత్వ మహిళా ఆశ్రమానికి అప్పగించారు.
దక్షిణరైల్వేకు కొత్త ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా వినయన్
కొరుక్కుపేట: దక్షిణ రైల్వే కొత్త ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా జే వినయన్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకుముందు దక్షిణ మద్య రైల్వే సీనియర్ డిఫ్యూటీ జనరల్ మేనేజర్గా సేవలందించారు. మే నెలలో ఉద్యోగ విరమణ చేసిన బె జీ జార్జ్ స్థానంలో జే వినయన్ నియమితులయ్యారు.