కష్టాల ‘యోగ’ం | - | Sakshi
Sakshi News home page

కష్టాల ‘యోగ’ం

Jun 9 2025 8:08 AM | Updated on Jun 9 2025 8:08 AM

కష్టాల ‘యోగ’ం

కష్టాల ‘యోగ’ం

బొమ్మనహాళ్‌: ప్రచార ఆర్భాటానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కూటమి సర్కార్‌ తీరుతో అధికారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రతి పనికీ సర్వేల పేరుతో ఇటు సచివాలయ సిబ్బందిని, అటు ప్రజలనూ ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో పని ఒత్తిడికి లోనైన సచివాలయాల కార్యదర్శుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. తాజాగా యోగ యాప్‌ అంటూ ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలంటూ జారీ అయిన ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులకు కష్టాల ‘యోగ’ం రెట్టింపయింది.

ఫేస్‌ రికగ్ననైజేషన్‌తో తిప్పలు

సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి యోగా యాప్‌ చూపించి వారు వస్తారో లేదో తెలుసుకుని వివరాలు నమోదు చేయాలి. హాజరయ్యేందుకు ఆసక్తి చూపితే వివరాల నమోదు సమయంలో వారి ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి సబ్మిట్‌ చేయాల్సి దరఖాస్తు పూర్తి చేసినట్లే. ఇంత వరకూ అంతా బాగున్నా... నో ఆప్షన్‌ పెడితే... ఆ కుటుంబంలో ఎవరో ఒకరిది ఫేష్‌ రికగ్ననైజేషన్‌ లేదా బయోమెట్రిక్‌తో వివరాలు పూర్తి చేయాల్సి ఉంది. నో ఆప్షన్‌ కింద వివరాలు నమోదు చేయడం కార్యదర్శులకు చుక్కలు చూపిస్తోంది. ‘కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఆసక్తి లేదంటే ఫొటో తీస్తారా? బయోమెట్రిక్‌ కావాలని అడుగుతారా? అసలు ఎందుకివ్వాలి? ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండి?’ అంటూ గృహ యజమానులు అసహనం వ్యక్తం చేస్తుండడంతో వారికి నచ్చచెప్పుకోలేక కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. అసలే సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేపర్లు, సోషల్‌ మీడియాల్లో వార్తలు వస్తున్నాయని, ప్రభుత్వం, పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న తరుణంలో ఓటీపీలు అడగడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఓ వైపు శిక్షణ... మరోవైపు పోటీలు

మూడు రోజుల క్రితం యోగాంధ్ర యాప్‌లో పంచాయతీల్లో యోగాసనాలపై మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చినట్లు వివరాలు నమోదు చేయాలని నిబంధన పెట్టారు. ఒక వైపు మండల స్ధాయిలో మాస్టర్స్‌ ట్రైనర్స్‌తో శిక్షణా కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సచివాలయ స్ధాయిలో యోగా తరగతులు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే సూచించారు. ఇది పూర్తి కాకుండానే పంచాయతీల పరిధిలో పోటీలు ఎలా పెట్టాలో, శిక్షణ లేని వారు పోటీల్లో ఎలా పాల్గొంటారో అర్ధం కావడం లేదని సచివాలయ కార్యదర్శులు వాపోతున్నారు.

ప్రజా సేవలకు దూరంగా...

ఒక్కో సచివాలయ పరిధిలో వేలాది మందిని సర్వే చేసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నదీ.. లేనిది వివరాలు నమోదు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఉన్నతాధికారులకే ఓ అంచనా లేదు. అన్నీ బాగుండి సర్వర్‌ మొరాయించకపోతే పూర్తి చేయడానికి ఒక్కో వ్యక్తి దగ్గర కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. దీంతో కార్యదర్శులు ప్రజా సేవలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సచివాలయల వద్దకు రేషన్‌కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో సర్వేల పేరుతో కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు.

యోగా డే యాప్‌ సర్వే పేరుతో

కార్యదర్శులకు సర్కార్‌ టార్గెట్లు

ఓటీపీలతో తప్పని ఇక్కట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement