రాడ్డు బెండింగ్‌ చేస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

రాడ్డు బెండింగ్‌ చేస్తుండగా..

Jun 9 2025 7:48 AM | Updated on Jun 9 2025 7:48 AM

రాడ్డు బెండింగ్‌ చేస్తుండగా..

రాడ్డు బెండింగ్‌ చేస్తుండగా..

ఇనుప చువ్వ గుచ్చుకుని

వ్యక్తికి తీవ్రగాయాలు

సీతారామపురం: సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్‌ రోడ్డు మార్గంలో భారతమాల ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఆదివారం రాడ్డు బెండింగ్‌ పనులు చేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజు మండల్‌ అనే వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న రాజు మండేల్‌ రాడ్డు బెండింగ్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ ఇనుప చువ్వ రాజు కంటి పక్కన గుచ్చుకుంది. ఇది లోతుగా దిగడంతో ముక్కు నుంచి రక్తస్రావం అధికమైంది. సహచర కార్మికులు క్షతగాత్రుడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

విద్యుత్‌షాక్‌కు గురైన

విద్యార్థి మృతి

నెల్లూరు(క్రైమ్‌): విద్యుత్‌షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందారు. పోలీసుల సమాచారం మేరకు.. విడవలూరుకు చెందిన ఎం.వెంకటరమణయ్య, పార్వతి దంపతుల చిన్న కుమారుడు హనీష్‌కార్తీక్‌(17) నెల్లూరు వెంకటేశ్వరపురం ఐటీఐ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌ 17వ తేదీ నుంచి ఉడ్‌కాంప్లెక్స్‌లోని ఓ ఇంటీరియర్‌ ఫ్యాక్టరీలో వెల్డర్‌ విభాగంలో అప్రెంటీస్‌గా చేస్తున్నారు. గతనెల 30వ తేదీన వెల్డింగ్‌ పనులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. ఫ్యాక్టరీలోని వారు అతన్ని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హనీష్‌కార్తీక్‌కు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని, బతకడం కష్టమని ఈనెల 4వ తేదీన వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే బతికే అవకాశం ఏదైనా ఉంటుందేమోనని అదేరోజు నెల్లూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. మృతుని తండ్రి వెంకటరమణయ్య ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన వ్యక్తి మృతి

సంగం: సంగంలోని ఎర్ర చెరువు సమీపంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో గాయపడిన ఇద్దరిలో ఒకరు ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెన్నవరప్పాడుకు చెందిన ముత్యాలకోటయ్య (60) మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. చెన్నవరప్పాడు సర్పంచ్‌గా కోటయ్య గతంలో చేశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

కండలేరులో

38.687 టీఎంసీల నీరు

రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 38.687 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఇన్‌చార్జి ఈఈ రామచంద్రమూర్తి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,360, పిన్నేరు కాలువకు 10, లోలెవల్‌ కాలువకు 60, హైలెవల్‌ కాలువకు 50, మొదటి బ్రాంచ్‌ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.

వ్యక్తి మృతిపై

కేసు నమోదు

ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని జాతీయ రహదారిపై వాశిలి సమీపంలో గత నెల 26న రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జిలానీ తెలిపారు. వారి వివరాల మేరకు.. ఏఎస్‌పేట మండలం కుప్పురుపాడుకు చెందిన రాగయ్య (51) నెల్లూరు–ముంబై రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందడంతో కేసు నమోదు చేసి ఢీకొన్న వాహనాన్ని గుర్తించనున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement