
సహజ ఎరువులతో ఆరోగ్యం
కొడవలూరు: సహజ సిద్ధమైన ఎరువులను వినియోగించి పంటలను సాగు చేయడం ద్వారా భూమి ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యకర ఉత్పత్తులు ప్రజలకు అందుతాయని భారతీయ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డీవీకే నాగేశ్వరరావు సూచించారు. మండలంలోని రామన్నపాళెంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగేశ్వరరావు విచ్చేసి, మాట్లాడారు. భూసార పరీక్షలు తప్పనిసరని, ప్రతి రైతు గుర్తించుకోవాలన్నారు. తద్వారా భూమి ఆరోగ్యం తెలుసుకుని ఎరువులు వినియోగించుకోవచ్చన్నారు. నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల శాస్త్ర విభాగం శాస్త్రవేత్త పి.మధుసూదన్ మాట్లాడుతూ మొక్కల్లో రోగ లక్షణాలను గుర్తించి తగిన మందులను మోతాదు మేరకు ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలన్నారు. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కేవీకే శాస్త్రవేత్త కె.కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ జీవన ఎరువులు వాడుకుని రసాయన ఎరువులను 25 శాతం వరకు తగ్గించుకోవాలని చెప్పారు. ఏఓ లక్ష్మి మాట్లాడుతూ నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిలకలు సకాలంలో వచ్చి దిగుబడి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వీఏఏ ఆర్.నిహారిక, రైతులు పాల్గొన్నారు.
భారతీయ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త నాగేశ్వరరావు