
కాకాణిపై ఆగని కక్షసాధింపు
నిర్దోషిగా బయటకొస్తారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి, అక్రమాలను నిత్యం ఎండగడుతున్నారనే అక్కసుతో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని కూటమి పెద్దలు టార్గెట్ చేశారు. ఆయన్ను కట్టడి చేయాలనే లక్ష్యంతో తప్పుడు కేసులకు తెరలేపారు. పేపర్ కటింగ్లను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారనే కారణం మొదలుకొని అక్రమ మైనింగ్, అట్రాసిటీ అంటూ ఏడు కేసులు బనాయించారు. అక్రమ మైనింగ్ కేసులో జైలుకు పంపారు. పాత కేసులను తిరగదోడి ఆయనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా, అందులో ఇరికించే కుట్ర జరుగుతోంది. తాజాగా మరో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసులతో కాకాణిని ముప్పతిప్పలు పెట్టడంతో పాటు ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రెడ్బుక్ రాజ్యాంగ అమల్లో తలమునకలు
రెడ్బుక్ రాజ్యాంగ అమల్లో కొందరు పోలీసులు తలమునకలై ఉన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఫిర్యాదు అందడమే తరువాయిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుతో ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కేసులు, అరెస్టులతో భయపడే ప్రసక్తేలేదని పార్టీ శ్రేణులు ఇప్పటికే తేల్చిచెప్పాయి.
ప్రశ్నలతో వేధించి పైశాచికానందం
జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న కాకాణి గోవర్ధన్రెడ్డిని కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి పోలీసులు ఈ నెల ఆరున తీసుకున్నారు. విచారణలో రకరకాల ప్రశ్నలతో వేధించారు.
కేసుల పరంపర
● గుంటూరు జిల్లాలోని తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గతేడాదిలో ప్రెస్మీట్ పెడితే ఆ వార్తను సాక్షి ప్రచురించింది. పేపర్ కటింగ్ను తన వాట్సాప్ గ్రూపులో ఫార్వార్డ్ చేశారనే నెపంతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.
● వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్మీట్ పెడితే, ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారని మరో కేసుకు తెరలేపారు.
● స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకరంగా పోస్టు పెట్టారంటూ ముత్తుకూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయించారు
● భవన నిర్మాణ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలపడమే అపరాధంగా దర్గామిట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
● వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. వీరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్త వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
● కావలి నియోజకవర్గం బోగోలు మండలం కోళ్లదిన్నెలో పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. గాయపడిన వారిని పరామర్శించి.. పోలీసుల తీరును ఎండగట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమకు బాధ కలిగించాయని టీడీపీ కార్యకర్తల కావలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.
● పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్కు సహకరించారంటూ పొదలకూరు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. అనంతరం నాన్బెయిలబుల్ సెక్షన్లు జోడించి అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
తెరపైకి మరో నాలుగు..
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులను హేళన చేస్తూ, వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా కాకాణి గోవర్ధన్రెడ్డి మరికొందరితో కలిసి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో దుష్ప్రచారాలు, వ్యంగ్య చిత్రాలను పోస్ట్ చేస్తున్నారంటూ శాసనసభ్యుడి ముఖ్య అనుచరుడు మేకల సురేంద్ర మంగళగిరిలోని సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై కేసు నమోదైంది. తాజాగా కోర్టు అనుమతితో నేడో, రేపో ఆయన్ను విచారించనున్నారు.
సర్వేపల్లిలో గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారంటూ వెంకటాచలం పోలీసులు కాకాణితో పాటు వెంకటశేషయ్య, నిరంజన్రెడ్డిపై కేసును రెండు రోజుల క్రితం నమోదు చేశారు.
కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ను పెట్టి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డిపై ముత్తుకూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
గత ఎన్నికల సందర్భంగా విరువూరు వద్ద మద్యం దొరకగా, అప్పట్లో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీ ట్ను సైతం దాఖలు చేశారు. ఆ కేసును తిరగదోడి కాకాణి గోవర్ధన్రెడ్డి, సురేష్ పేర్లను చేర్చారు.
ఇప్పటికే ఏడు అక్రమ కేసులు
తాజాగా మరో నాలుగు వెలుగులోకి
పరాకాష్టకు కూటమి వేధింపులు
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. రెడ్బుక్ రాజ్యాంగంతో విధ్వంసం సృష్టించడం, అక్రమ అరెస్టులకు తెగబడటమే లక్ష్యంగా సర్కార్ చెలరేగిపోతోంది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి.. తమ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల గొంతుకులను నొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ వికటాట్టహాసం చేస్తోంది. జిల్లాలో ఈ తరహా చర్యలు పరాకాష్టకు చేరాయి.
నెల్లూరు(స్టోన్హౌస్పేట): మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషి గా బయటకొస్తారని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పేర్కొన్నారు. డైకస్ రోడ్డులోని కాకాణి నివాసంలో ఆయన కుమార్తె పూజితను మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డితో కలిసి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురిచేసే పనులు చేయడం సబబు కాదని హితవు పలికారు. సుపరిపాలన అందించకుండా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి.. వారి అభివృద్ధి కోసం కృషి చేసిన కాకాణికి ఏమీ కాదని, కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.

కాకాణిపై ఆగని కక్షసాధింపు