
మరొకరికి కరోనా పాజిటివ్
● ఎనిమిదికి చేరిన కేసుల సంఖ్య
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఆదివారం నిర్వహించిన పరీక్షలో మరొకరికి కరోనా నిర్ధారణైంది. వనంతోపు సెంటర్కు చెందిన 61 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అనుమానమొచ్చిన డాక్టర్లు అదే ఆస్పత్రిలో పరీక్ష చేయగా, కరోనాగా కన్ఫర్మైంది. స్వల్ప లక్షణాలుండటంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎనిమిది కేసులు నమోదు కాగా, అందులో నగరంలోనే ఐదు ఉన్నాయి. కాగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులను ధరించాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు.
గురుపరంపరతోనే
సనాతన ధర్మ పరిరక్షణ
నెల్లూరు(బృందావనం): ప్రపంచంలోనే భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైందని, దీన్ని కొనసాగించేందుకు గురుపరంపర ఎంతో ముఖ్యమని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పేర్కొన్నారు. అల్లీపురంలో విఘ్నేశ్వరాలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన మూలాపేటలోని శంకరమఠంలో బస చేశారు. మఠం ప్రాంగణంలోని కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి హారతులిచ్చారు. భక్తులకు మంగళశాసనాలను అందజేసిన అనంతరం తిరుపతి పయనమయ్యారు.
ఆశ వర్కర్లకు
పనిభారం తగ్గించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పేదలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశ వర్కర్లతో సంబంధంలేని ఇతర పనులు చేయించకూడదని, వీరికి పనిభారాన్ని తగ్గించాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆమె మాట్లాడారు. వీరికి కనీస వేతనం అందడంలేదని, ఉద్యోగ భద్రత లేదని ఆరోపించారు. అనేక యాప్లను ఇచ్చి.. ఎలాంటి శిక్షణ నిర్వహించకుండానే పనిభారాన్ని పెంచుతున్నారని చెప్పారు. విజయలక్ష్మి, శిరీషా తదితరులు పాల్గొన్నారు.
గరుడవాహనంపై
లక్ష్మీనృసింహుడి విహారం
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి చందనాలంకారంలో ఆదివారం దర్శనమిచ్చారు. శ్రీవారి జన్మనరక్షత్రం స్వాతిని పురస్కరించుకొని అభిషేకం, పుష్పాలంకారం, శాంతి హోమం, కల్యాణాన్ని నిర్వహించారు. బంగారు గరుడవాహనంపై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి.. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కోన మాడవీధుల్లో ఊరేగించారు.

మరొకరికి కరోనా పాజిటివ్

మరొకరికి కరోనా పాజిటివ్