
యోగా ర్యాలీలు నేడు
నెల్లూరు రూరల్: జిల్లాలో యోగా ర్యాలీలను సోమవారం నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. యోగాంధ్ర ర్యాలీ నిర్వహణపై జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆదివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కు వద్ద జిల్లా స్థాయి ర్యాలీని ఉదయం 7.30కు నిర్వహించాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ఉదయగిరిలో మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నామని వెల్లడించారు.
ఓపెన్ చెస్ టోర్నీ ప్రారంభం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): మినీబైపాస్లోని నక్షత్ర స్కూల్లో ఆలిండియా ఓపెన్ చెస్ పోటీలను ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, ఎస్వీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 234 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ క్రీడాకారులు 66 మంది ఉన్నారు. ఆరు రౌండ్లకు గానూ ప్రణవ్, శైలేష్, పవన్తేజ, రామకృష్ణ ఆరు పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఫిడే మాస్టర్లు ప్రణవ్, మహేశ్వర్, నక్షత్ర స్కూల్ డైరెక్టర్ గాదిరాజు జీవన్కృష్ణ, చెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్, స్కూల్ డైరెక్టర్ సంధ్యారెడ్డి, నిర్వాహకులు వంశీ, సుధాశ్రీ, ఆర్బిటర్లు గోపీనాథ్, రామ్లక్ష్మణ్ పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు
92 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): డీఎస్సీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 92 మంది అభ్యర్థులు ఆదివారం గైర్హాజరయ్యారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1252 మందికి గానూ 1160 మంది హాజరయ్యారు.