
తడిగుడ్డతో గొంతు కోశారు
– కలెక్టరేట్ ఎదుట ఎండీయూ ఆపరేటర్ల నిరసన
ఉరిశిక్ష వేసే ఖైదీని కూడా చివరి కోరికను అడుగుతారని, కానీ పౌరసరఫరాల శాఖ మంత్రి, కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ అందరూ కలసి ఎండీయూ వాహనాలను రద్దు చేసి తడిగుడ్డతో 18,500 మంది కుటుంబాల గొంతు కోశారని ఎండీయూ ఆపరేటర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య ఎండీఎస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీబొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండీయూ ఆపరేటర్లకు 2027 జనవరి వరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉందని, ఎండీయూ వ్యవస్థ రద్దుతో 9,260 మంది ఎండీయూ ఆపరేటర్లు, అదనంగా 9,260 మంది హెల్పర్లకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. జిల్లా ప్రెసిడెంట్ ఎం.విశ్వనాథ్, వైస్ ప్రెసిడెంట్ ఎం.నాగరాజు, ట్రెజరర్ షేక్ అసిఫ్, సెక్రటరీ మస్తాన్వలీ, జాయింట్ సెక్రటరీ షేక్ జమీర్ పాల్గొన్నారు.
ఎండీయూ వాహనాలను కొనసాగించాలి
రాష్ట్రంలో ప్రతి ఇంటికి రేషన్ అందజేస్తున్న ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని ఆర్పీఐ జిల్లా అధ్యక్షులు ఎస్కె మాబు కలెక్టర్ ఆనంద్కు సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వినతిపత్రం సమర్పించారు. తొలుత ఎండీయూ వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీ చేసే వాహనాలను ఆపివేయడాన్ని నిరసిస్తూ బొసుబొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు మాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఎండీయు వ్యవస్థ ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను నిలిపివేయడం దారుణమన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు, ఉపాధ్యక్షులు కొత్తల మధుసూదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నంబూరు గణేష్, కోవూరు సురేష్, ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి తదితరులు ఉన్నారు.