
తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్కు గండం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్న పేద మహిళలను ఉచితంగా భద్రంగా ఇంటి వద్ద వదిలి పెట్టేందుకు 102 (తల్లీ, బిడ్డ ఎక్స్ప్రెస్)ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. పది వాహనాలను ఏజెన్సీ ద్వారా ఏర్పాటు చేసింది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ముగ్గురు, నలుగురు కాన్పులు అయ్యేదాక ఉండి అందరినీ ఒకే వ్యానులో ఎక్కించుకుని పైలట్ వెళ్లేవారు. అయితే పేద రోగుల ఇబ్బందులు తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక జిల్లాలో అప్పటి వరకు ఉన్న 10 వాహనాలను 19కి పెంచారు. తల్లి,బిడ్డ, మరో కుటుంబ సభ్యుడిని తీసుకుని ఇంటి దగ్గర క్షేమంగా వదిలి వచ్చేలా ఏర్పాటు చేశారు. పెద్దాస్పత్రిలో రోజుకు 14 నుంచి 20 వరకు కాన్పులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం మూడు నెలలుగా ఏజెన్సీకి నిధులివ్వకపోవడంతో ఆ వాహనాలు ఆపేశారు. జిల్లాలో తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్లు 19 ఉండగా కేవలం 13 మంది పైలట్లు మాత్రమే ఉన్నారు.
108 వాహనాలు.. ఆప సోపాలు
చంద్రబాబు కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20 వాహనాలు మాత్రమే ఉండేవి. వాటిలో కూడా 7 వాహనాలు ఎప్పుడూ రిపేర్లకు గురవుతూ ఉండేవి. టైర్లు అరిగి పోయి ఏక్షణాన పేలిపోతాయో అనే పరిస్థితి ఉండేది. అయితే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాత వాహనాల స్థానంలో కొత్తవాహనాలను ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున జిల్లాలో 38 వాహనాలు ఏర్పాటు చేశారు. వారికి ఏజెన్సీ ద్వారా సకాలంలో జీతాలు వచ్చేవి. అయితే చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టాక వారికి కష్టాలు తప్పడం లేదు. గత రెండు నెలలుగా జీతాలు రాలేదు. అప్పులతో గడుపుతున్నారు.