
రైస్మిల్లులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
● సుమారు 12.5 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా
కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురంలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి రైస్మిల్లులో పాలిష్ పట్టి.. మేలు రకం బియ్యంగా మార్చిన సుమారు 12.5 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం(500 బస్తాలు)ను శనివారం రాత్రి అధికారులు పట్టుకొన్నారు. ఇదే రైస్మిల్లులో గత నెల 3వ తేదీన 200 బస్తాల రేషన్ బియ్యం పట్టుకోవడం తెలిసిందే. చంద్రశేఖరపురంలోని రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతోందని శనివారం రాత్రి రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో డీటీ సారంగపాణి, వీఆర్వో సురేష్, ఎస్సై కోటిరెడ్డి మిల్లుకు చేరుకున్నారు. నిర్వాహకులు రైస్మిల్లుకు తాళాలు వేసి కొంత సేపు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎస్సై జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు తలుపులు తెరవడంతో అధికారులు లోనికి వెళ్లారు. భారీ ఎత్తున రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యంను, పదుల సంఖ్యలో కూలీలతో ప్లాస్టిక్ సంచుల్లో నింపి లారీకి లోడు చేస్తుండడాన్ని గుర్తించారు. రైస్ మిల్లును లీజుకు తీసుకుని రేషన్ బియ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి రేషన్ బియ్యం గోతాలు మిల్లులో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దాదాపు అన్నింటినీ ప్లాస్టిక్ బస్తాల్లో నింపారు. 25 కేజీల బస్తాలు సుమారు 500 బస్తాలు 12.5 మెట్రిక్ టన్నులు ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మిల్లులో గింజ ధాన్యం కొని ఆడించిన దాఖలాల్లేవని, ఇక్కడ కేవలం రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాత్రమే జరుగుతోందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రీసైక్లింగ్ చేసి మేలి రకం బియ్యం కింద విక్రయించే వ్యాపారం చేస్తున్న క్రమంలో అన్నీ 25 కిలోల ప్లాస్టిక్ బస్తాల్లో నింపుతున్నారు. మరో వంద బస్తాల దాకా నింపాల్సిన బియ్యం ఉన్నాయని తెలిపారు. తగినంత సిబ్బంది అందుబాటులో లేనందున ఆదివారం బస్తాలన్నింటినీ లెక్కించి కచ్చితంగా నిర్ధారిస్తామన్నారు. పేదల బియ్యంతో భారీగా కాసులు కురిపించుకొంటున్న వ్యాపారులు ఎన్ని పర్యాయాలు పట్టుకొన్నప్పటికీ అక్రమ వ్యాపారాన్ని ఆపడం లేదంటే ఇందుకు జిల్లా స్థాయిలో అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలోనే రేషన్ బియ్యం పట్టుబడితే మిల్లును సీజ్ చేయకపోవడంతోనే తిరిగి ఆ వ్యాపారం చేయడానికి అవకాశం ఏర్పడినట్లు తెలుస్తోంది.