
కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పాలన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కార్మిక వ్యతిరేక పాలనను కూటమి ప్రభుత్వం సాగిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు ఆరోపించారు. నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, కృష్ణపట్నం పోర్టులో కార్మికులను తొలగించడం మినహా ఎలాంటి పరిశ్రమలను స్థాపించిన దాఖలాల్లేవని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు దాసోహంగా ఉంటూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. సంక్షేమ బోర్డులోని రూ.వెయ్యి కోట్ల నిధులను దారి మళ్లించడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేస్తూ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. జూలై తొమ్మిదిన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, అజయ్కుమార్, నగర కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.