
ముందే రేషన్ దోపిడీ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జూన్ 1వ తేదీ.. జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద పండగ వాతా వరణం ప్రతిబింబించేలా షామియానాలు, కుర్చీ లు, ఫ్లెక్సీలు, పూల తోరణాలతో డెకరేషన్ చేశా రు. రేషన్ పంపిణీ ప్రక్రియ తమ చేతికే వచ్చిందని డీలర్లు పండగ చేయడం చూస్తే.. ఇక తమ అక్రమ దందాకు అడ్డు తొలగిపోయిందనే సంతోషం వెల్లివెరిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యేలే రేషన్ మాఫియాగా అవతరించారనేది జగద్వితమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ప్రతి రేషన్ దుకాణానికి నూరు శాతం రేషన్ బియ్యం నెలాఖరు రోజుకే చేరేవి. ప్రతి నెలా 1వ తేదీ ఉదయం 8 గంటలకే ఎంఈయూ వాహనాలు కార్డుదారుల ఇళ్ల ముందుకే వచ్చేవి. ప్రతి కార్డుదారుడు బియ్యం తీసుకెళ్లేవారు. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు, కేసులు నమోదు చేసినట్లు ఎక్కడా లేకపోవడం గమనార్హం. కూటమి అధికారంలోకి వచ్చాక 5వ తేదీ వరకు ఎండీయూ వాహనాలు వచ్చిన పరిస్థితి లేదు. వచ్చినా.. అరకొర మందికి ఇచ్చి మళ్లీ వస్తామంటూ చెప్పుకొచ్చారు. ఒకటి..రెండు నెలలు అయితే వాహనాలే రాని పరిస్థితి ఉంది.
ప్రతి నెలా అరకొర మందికే..
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అరకొర మందికే రేషన్ సరుకులు సరఫరా అయ్యాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు చేరుతున్నట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ.. వాస్తవానికి ఆ బియ్యం అంతా నేరుగా రైస్ మిల్లులకు వెళ్లాయని కొందరు సివిల్ సప్లయీస్ శాఖాధికారులు అంగీకరించారు. గత రెండు నెలల క్రితం దగదర్తి మండల కేంద్రంలో, కోవూరు సమీపంలో చైన్నె–కోల్కత్తా హైవేలో రెండు లారీల్లో వెళ్తున్న సుమారు 900 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడినా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆగమేఘాల మీద వదిలేసిన విషయా లు తెలిసిందే. నిజంగా కార్డుదారులకు బియ్యం చేరి ఉంటే.. ఈ స్థాయిలో బియ్యం అక్రమ రవాణాకు ఎక్కడ ఆస్కారం ఉంటుందనే ప్రశ్నలకు అధికారులు కానీ, కూటమి నేతలు కానీ, పచ్చ మీడియా సమాధానం చెప్పరు. తాజాగా నెల్లూరు రూరల్ పరిధిలో బియ్యం మాఫియా బరితెగించి దుకాణాల్లో ఉన్న బియ్యాన్ని రాత్రికి రాత్రే తరలించేశారు. జూన్ 1వ తేదీ రేషన్ దుకాణాల దగ్గరే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటన చేసినా ఇరుకుల పరమేశ్వర్నగర్లో ముందు రోజు రాత్రే దుకాణం తెరిపించి, అర్ధరాత్రి వేళ బియ్యాన్ని అక్రమ రవాణా చేశారు. ఇది స్థానికులు వీడి యో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయినా సంబంధిత దుకాణంలో బియ్యం స్టాక్ తనిఖీ చేయడం కానీ, విచారణ జరపడం కానీ చేయలేదు.
80 శాతంపైనే విదేశాలకు ఎగుమతి
జిల్లాలో ఉన్న 7.22 లక్షల రేషన్ కార్డులకు నెలకు సుమారు 10,923 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇందులో 15 నుంచి 20 శాతం మాత్రమే కార్డుదారులు కొని తీసుకెళ్తున్నారు. మిగిలిన 80–85 శాతం బియ్యం కావలి, నెల్లూరులోని సౌత్రాజుపాళెం, శెట్టిగుంటరోడ్, బుచ్చిరెడ్డిపాళెం–రాజుపాళెం రహదారిలో ఉన్న రైస్ మిల్లు, పోతిరెడ్డిపాళెం, అల్లీపురం, నెల్లూరు రూరల్ పరిధిలోని గుడిపల్లిపాడు, చెముడుగుంట, కందుకూరు నియోజకవర్గంలోని పెదపవనిలో ఉన్న రైస్మిల్లులకు చేర్చి పాలిష్ పట్టించి కృష్ణపట్నం, చైన్నె పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
నెలకు రూ.27 కోట్ల రాబడి
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు డీలర్లే సూత్రధారులు. కార్డుదారులకు ఇచ్చిన బియ్యాన్ని కేజీకి రూ.10లకు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఒక్కొక్క రేషన్ డీలర్ వద్ద 250 నుంచి 300 బినామీ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు బియ్యం సరఫరా చేసినట్లు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క రేషన్ దుకాణం నుంచి 80 – 85 శాతం అంటే దాదాపు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బ్లాక్ మార్కెట్కు చేరుతోంది. అంటే ప్రతి నెలా సగటున 90 లక్షల కేజీలు అక్రమ రవా ణా జరుగుతుందని అంచనా. తాజాగా బియ్యం మాఫియా ఆయా రేషన్ దుకాణాలకు చేరాల్సిన బియ్యాన్ని నేరుగా రైస్మిల్లులకు తరలిస్తున్నా రు. డీలర్కు కేజీకి రూ.20 లెక్కన ఇస్తున్నారు. మార్కెట్లో కేజీ బియ్యం రూ.60 నుంచి రూ.65ల కు అమ్ముతున్నారు. ఈ లెక్కన రవాణా ఖర్చులు, పాలిష్ తరుగు, సివిల్ సప్లయీస్ అధికారులకు మామూళ్లకు కేజీకి రూ.10 ఖర్చు పోయినా.. కేజీకి నికరంగా రూ.30 మిగులుతోంది. 90 లక్షల కేజీలకు.. కేజీకి రూ.30 లెక్కన దాదాపు రూ.27 కోట్ల మేర మాఫియాకు రాబడి వస్తోంది.
మొత్తం రేషన్ షాపులు
1,513
బియ్యం కార్డులు 7.22 లక్షలు
నెలకు సరఫరా అయ్యే బియ్యం
10,923 మెట్రిక్ టన్నులు
కార్డుదారులకు చేరేది
15-20 శాతమే
అక్రమ రవాణా అంచనా
9,000 మెట్రిక్ టన్నులు
ఉలవపాడు: రేషన్ షాపుల వ్యవస్థ ప్రారంభమైన వెంటనే అక్రమార్కుల హవా మొదలైంది. మండలంలో ప్రతి రేషన్ షాపునకు 50 బస్తాలు తక్కువగా రేషన్ బియ్యం సరఫరా చేసినట్లు సమాచారం. మండలంలో 31 రేషన్ షాపులు ఉండగా మూడు షాపులు తప్ప మిగిలిన అన్ని షాపులకు 50 బస్తాలు కోత విధించడంతో.. మొదటి నెలలోనే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని రేషన్ డీలర్లు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ విషయమై తహసీల్దార్ టి.శ్రీనివాసులు వివరణ కోరగా బస్తాలు తగ్గించిన విషయం నాకు తెలియదు, డీలర్లు అధికారులతో మాట్లాడి విచారణ జరిపి తెలుసుకుంటామని తెలిపారు.