
సాంఘిక సంక్షేమ శాఖలో ఫెవికాల్ ఉద్యోగులు
● 14 ఏళ్లుగా ఒకే స్థానంలో తిష్టవేసిన కొందరు ఉద్యోగులు
● బదిలీల ప్రక్రియలో చక్రం
తిప్పుతున్న లీడర్లు
● ఎక్కడి వారు అక్కడే
● నిబంధనలు పాటించకుండా తయారు చేసిన బదిలీల ఫైల్ తిరస్కరించిన డీఆర్ఓ
నెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియలో ఉద్యోగ సంఘాల నేతలు చక్రం తిప్పుతున్నారు. పారదర్శకంగా జరగాల్సిన బదిలీలకు మసిపూసి మారేడు కాయ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను పాటించకుండా ఎక్కడి వారు అక్కడే ఉండేలా, లేదంటే అటూ.. ఇటూ మార్పులతో జాబితాను తయారు చేశారు. దీంతో ఈ ఫైల్ను డీఆర్వో తిరస్కరించారు. దీంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అసంబద్ధ జాబితాతో బదిలీల కోసం వేచి చూస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐదేళ్లు ఒకే స్థానంలో పని చేసిన వారిని కచ్చితంగా అక్కడి నుంచి బదిలీ చేయాల్సి ఉంది. ఇందులో ఒక ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండేవారు, భార్యాభర్తలు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన పిల్లల ఉన్న వారికి ఈ బదిలీల్లో మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అయితే సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ఈ నిబంధనలకు నీళ్లొదిలారు. ఖాళీల జాబితాలను ముందుగా ప్రకటించకుండానే కొందరు ఉమ్మడి జిల్లాలో పనిచేసే ఉద్యోగులు ఈ జిల్లాలో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరు ఈ జిల్లాకు సంబంధించిన వారు కాదని తిరుపతి జిల్లాకు చెందిన వారిని చెప్పుకొచ్చారు. అయితే నెల్లూరు జిల్లాలోనే మరి కొంత మందిని తిరుపతి జిల్లాకు చెందిన వారిని ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బదిలీల జాబితాను డీఆర్ఓ తిరస్కరించారని ఉద్యోగులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో యూనియన్ నాయకులుగా చెలామణి అవుతున్న సుమారు 12 మంది 14 సంవత్సరాలుగా ఒకే స్థానంలో పని చేస్తున్నప్పటికీ, వారిని మళ్లీ అదే స్థానాల్లో కొనసాగించేలా జాబితాను తయారు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల మేరకు ఉద్యోగ సంఘాల్లో పనిచేసే నేతలు 9 ఏళ్ల పాటు ఒకేచోట పనిచేసేలా మినహాయింపు ఉంది. ఆ తర్వాత కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను సైతం పక్కన పెట్టి యూనియన్ నాయకులు వారి బదిలీలతోపాటు వారికి ఇష్ట మొచ్చిన వారికి, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి, బదిలీల కోసం డబ్బులు పెట్టుకునే వారికి అండగా ఉంటూ ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ జీఓలను పట్టించుకోకుండా బదిలీల ప్రక్రియను చేస్తుండడం వల్ల ఉమ్మడి జిల్లాలో పురుష ఉద్యోగులతోపాటు మహిళా ఉద్యోగులు సైతం నష్టపోతున్నారు. యూనియన్ నేతలకు ఇష్టమైన వారికి అనుకూలంగా, వ్యతిరేకులు అయితే మరో రకంగా వ్యవహరిస్తూ బదిలీల జాబితా చేయడం, లోకల్ పాయింట్లను పట్టించుకోక పోవడం ఆరోపణలకు తావిస్తోంది. ఇదే సమయంలో బదిలీల ఫైల్ను డీఆర్ఓ తిరస్కరించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చినట్లు అయింది. ఈ నెల 2 నుంచి బదిలీల ప్రక్రియను 9వ తేదీ వరకు పొడిగించడంతో సాంఘిక సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియలో నిబంధనలకు అతీతంగా ఎన్ని లీలలు జరుగుతాయో వేచి చూడాల్సిందే..
డీఆర్వో వద్ద బీసీ సంక్షేమ
శాఖ ఫైలు
నా సీటుకు
ఢోకా లేదు..!
జిల్లా బీసీ సంక్షేమ శాఖకు చెందిన వార్డెన్ల బదిలీలకు సంబంధించిన ఫైలుకు డీఆర్వో వద్ద బ్రేక్ పడింది. యూనియన్ నేతల అండ ఉన్న వారికి కోరిన చోటుకు పోస్టింగ్ ఇచ్చేందుకు ఫైల్ను సిద్ధం చేసుకుని బేరసారాల కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి కొంత మేర యూనియన్ నాయకులు చెప్పిన పేర్లకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ ఫైల్ డీఆర్వో వద్ద బ్రేక్ పడడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. తాము ఉన్న చోటే ఉంటామని సంబరపడిన వార్డెన్లు సైతం తమను ఎక్కడికి బదిలీ చేస్తారోనని బెంబేలెత్తుతున్నారు. ఈ నెల తొమ్మిది వరకు బదిలీలకు గడువు ఉండడంతో మౌనంగా ఉన్నారు. మే నెల 31న క్లాస్– 4 ఉద్యోగుల బదిలీలు జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో హడావుడిగా జరిగాయి. అక్కడ కూడా యూనియన్ నేతలు జిల్లా అధికారి చాంబర్లోనే ఉండి మంతనాలు జరిపినట్లు సమాచారం. యూనియన్ నాయకుల బేరసారాలు ఫలితాలిస్తాయా, పారదర్శకంగా బలీలు జరుగుతాయా అనే విషయం కూడా ఈ నెల 9 వరకు వేచి చూడాలి.

సాంఘిక సంక్షేమ శాఖలో ఫెవికాల్ ఉద్యోగులు