పిట్‌ మెజర్‌మెంట్‌కు పాతర | - | Sakshi
Sakshi News home page

పిట్‌ మెజర్‌మెంట్‌కు పాతర

Jun 9 2025 8:08 AM | Updated on Jun 9 2025 8:08 AM

పిట్‌ మెజర్‌మెంట్‌కు పాతర

పిట్‌ మెజర్‌మెంట్‌కు పాతర

సిబ్బంది లేమితోనే!

పిట్‌ మెజర్‌మెంట్‌ ప్రక్రియ నిర్ణీత సమయంలో ఎందుకు నిర్వహించలేదనే విషయమై ‘సాక్షి’భూగర్భ గనులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవిబాబును వివరణ కోరగా.. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఈ పక్రియ సకాలంలో జరిగి ఉండకపోవచ్చన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఈ ప్రక్రియ జరగాల్సి ఉంటుందని ఇకపై ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియను నిర్వహిస్తామని చెప్పారు.

కళ్లు మూసుకున్నందుకు అధికారులకు కాసులు!

మైనింగ్‌ కుంభకోణంలో అధికారుల పాత్రపై అనుమానాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాళ్లు, ఖనిజాల క్వారీల్లో అక్రమ మైనింగ్‌ దందాకు భూగర్భ గనుల శాఖ అధికారులు అడుగడుగునా వంత పాడారా.? రూ.వందల కోట్లు సీనరేజీ ఎగవేసి ఇష్టానుసారంగా ఖనిజ సంపదను కొల్లగొడుతుంటే అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఈ అధికారులకు కాసుల వర్షం కురిసిందా..? జిల్లాలో వెలుగు చూసిన రూ.974 కోట్ల మైనింగ్‌ కుంభకోణంలో భూగర్భ గనులశాఖ అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మైనింగ్‌ మాఫియా నుంచి ప్రతినెలా పెద్ద మొత్తంలో దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసిన ఆశాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారనేది సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో స్టోన్‌ అండ్‌ మెటల్‌ క్వారీల్లో నిర్వహించిన ఈటీఎస్‌ సర్వేలో భారీ మైనింగ్‌ కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అడ్డగోలు సహజ సంపదను లూఠీ చేసిన 15 మైనింగ్‌ కంపెనీలకు రూ.974 కోట్లు చెల్లించాలని ఆశాఖ డిమాండ్‌ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. రాజకీయ అండదండలతో ఇష్టానుసారంగా దోపిడీ చేసిన మైనింగ్‌ మాఫియా..జిల్లాలోని సహజ సంపదను లూఠీ చేసింది. విచ్చల విడిగా తవ్వకాలు జరిపి విలువైన స్టోన్‌ అండ్‌ మెటల్‌ను తరలించి రూ.వేల కోట్లు వెనుకేసుకుంది.

ఇన్నేళ్లు ఎందుకు చేయలేదు..?

ఏదైనా మైనింగ్‌ లీజు మంజూరు చేస్తే...ఆ లీజు తీసుకున్న క్వారీలో ఎంత మొత్తంలో ఖనిజ సంపద తవ్వి రవాణ చేశారు. తరలించిన ఈ ఖనిజ సంపదకు అంతేమొత్తంలో భూగర్భ గనులశాఖకు సీనరేజీ చెల్లించారా..? అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్ణీత సమయంలో పిట్‌ మెజర్‌మెంట్‌ ప్రక్రియ చేపట్టాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఈ పిట్‌ మెజర్‌మెంట్‌ ప్రక్రియను నిర్వహించాలి. పిట్‌ మెజర్‌మెంట్‌ చేస్తే ఎంత మొత్తంలో ఖనిజాన్ని తవ్వారనేది తేలిపోతుంది. అయితే ఏళ్ల తరబడి ఈ పిట్‌ మెజర్‌మెంట్‌ జరగలేదు. ఎంతన్నా తవ్వుకుని పోనివ్వు..మాకు ప్రతినెలా మామూళ్లు ఇస్తే చాలన్నట్లు ఆశాఖ అధికారులు వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఈ అక్రమ మైనింగ్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. కనీసం ఫిర్యాదులు వచ్చిన క్వారీల్లోనైనా ఈ పిట్‌ మెజర్‌మెంట్‌ ప్రక్రియ నిర్వహించలేదంటే..ఆ శాఖ అధికారులు ఈ దోపిడీకి ఏ మేరకు సహకరించారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో ముడుపులు అందుకుని కళ్లు మూసుకున్నారనే విమర్శలున్నాయి.

అధికారుల పాత్రపై విచారణ

జిల్లాలో వెలుగు చూసిన మైనింగ్‌ కుంభకోణంలో ఆ శాఖ అధికారుల పాత్రపై విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా, జియాలజిస్టులుగా, రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసిన అధికారుల పాత్ర ఈ కుంభకోణంలో ఎంత వరకు ఉందనే అంశపై లోతైన విచారణ జరగాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఇక్కడ పనిచేసిన అధికారులు చాలామంది రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement