
కేంద్రంపై కార్మికలోకం ఉద్యమించాలి
జిన్నారం (పటాన్చెరు): కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మిక లోకానికి వ్యతిరేకంగా నాలుగు లేబర్ చట్టాలను అమలు చేయాలని చూస్తోందని, వెంటనే వాటిని రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ నాలుగు కోడ్లను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజీపల్లి టీఐడీసీ పరిశ్రమ కార్మికులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లేబర్ చట్టాలు అమల్లోకి వస్తే 95% కార్మికులకు వెట్టిచాకిరిలోకి వెళ్లిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని 12 గంటల వరకు పెంచుతారని అలాగే కనీస వేతనాలు పీఎఫ్, ఈఎస్ఐ బోనస్ సౌకర్యాలు కూడా అందవని చెప్పారు. నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని కార్మిక వర్గం అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేశ్, రాజయ్య, భాస్కర్రెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, శ్రీరాములు, ప్రభాకర్, సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు