
నిమ్జ్లో హ్యుందాయ్ విస్తరణ
సంగారెడ్డిజోన్: జహీరాబాద్ నియోజకవర్గంలోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్)లో ఏర్పాటు కానున్న హ్యుందాయ్ పరిశ్రమను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే హ్యుందాయ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రాంతాల్లో పరిశ్రమ విస్తరణకు అనుకూలమైన నేలలు ఉండటంతో హ్యుందాయ్ ప్రతినిధులు పరిశ్రమను విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా నిమ్జ్లో వేమ్ టెక్నాలజీ పరిశ్రమ ఏర్పాటు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
పరిశోధనాభివృద్ధి కేంద్రం ఏర్పాటు
దక్షిణ కొరియా ఆటోమెటివ్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ రాష్ట్రంలోని నిమ్జ్లో ఆ సంస్థ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించనుంది. సుమారు 675 ఎకరాల విస్తీర్ణంలో రూ.8,500కోట్లతో నెలకొల్పనున్నారు. ఇందులో ఆటోమెటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ లైన్, ప్రోటో టైపింగ్ ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా కార్ల తయారీతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు, వాహనాల టెస్టింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 4,000లకు పైగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడి ప్రాంతంలో 407 ఎకరాల విస్తీర్ణంలో ఇదే పరిశ్రమ వాహనాల టెస్టింగ్ ట్రాక్ నిర్మించేందుకు భూములను కేటాయించింది. అయితే ప్రస్తతం రిసెర్చ్ సెంటర్ను స్థాపించాలని నిర్ణయించింది.
అనుకూలమైన భూములు గుర్తింపు
ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామ శివారులో పరిశ్రమ ఏర్పాటుకు మొదటగా భూమిని కేటాయించారు. పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన భూములలో సాంకేతిక బృందం సభ్యులు సుమారు 50 పాయింట్లలో 20 మీటర్ల మేర లోతులో మట్టి నమూనాల్లో సేకరించి పరిశ్రమల స్థాపనకు భూములు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు.
త్వరలో భూములు పరిశీలించనున్న పరిశ్రమ ప్రతినిధులు
నిమ్జ్లో పరిశ్రమ స్థాపన కొరకు పరిశ్రమ ప్రతినిధులు త్వరలో పర్యటించి, భూములు పరిశీలించనున్నారు. ఇందుకోసం ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్, ఎల్గోయి ప్రాంతాల్లో భూములను కేటాయించారు.
675ఎకరాలు.. రూ.8,500కోట్ల పెట్టుబడులు
పరిశ్రమ ఏర్పాటుకు స్థలం కేటాయింపు
త్వరలో భూములు పరిశీలనకు ప్రతినిధులు