ఎమ్‌టీ కోక్‌ తగిలి కానిస్టేబుల్‌కు గాయాలు

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో రాజశేఖర్‌ - Sakshi

సిద్దిపేటకమాన్‌: గన్‌ శుభ్రం చేస్తుండగా లోపల ఉన్న ఎమ్‌టీ కోక్‌ తగిలి ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఎస్‌.రాజశేఖర్‌ సిద్దిపేట సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం సాయుధ దళాల వార్షిక పునశ్చరణలో భాగంగా రాజగోపాల్‌పేటలో పోలీస్‌ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ నిర్వహించి, అనంతరం ఆయుధాలను సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌కు తరలించారు. విధుల్లో ఉన్న రాజశేఖర్‌ మంగళవారం ఏకే 47 తుపాకీని శుభ్రం చేస్తుండగా లోపల ఇరుక్కుపోయిన ఎమ్‌టీ కోక్‌ ఒత్తిడికి గురై బలంగా వెనక్కి రావడంతో కుడి కన్ను, భుజానికి తగిలింది. ఘటనలో గాయపడిన రాజశేఖర్‌ను పోలీసు సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌ సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్‌కు అందుతున్న వైద్య సేవలపై సీపీ శ్వేత ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యాధికారులకు సూచించారు.

ఏకే–47 శుభ్రపరుస్తుండగా ఘటన

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స..ఆపై హైదరాబాద్‌కు తరలింపు

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top