
● అధ్వానంగా లింక్రోడ్లు ● అడుగుతీసి వేయలేని వైనం ● వర్
చందుర్తి/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలోని లింక్రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం వర్షాలు కొడుతుండడంతో గుంతల్లో నీరు చేరి ఎంత లోతు ఉన్నాయో తెలియక గాయపడుతున్నారు. గత పదేళ్లుగా లింక్రోడ్లను పట్టించుకునే వారు లేక పల్లె రహదారులు చిద్రమయ్యాయి. గ్రామీణ రహదారుల దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.
మంజూరుకాని నిధులు
● చందుర్తి మండలంలో ఐదు లింక్రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అత్యంత ప్రధాన్యత గల కిష్టంపేట–బండపల్లిరోడ్డుకు రూ.25 లక్షలు మంంజూరైనట్లు 2023లో వేములవాడ అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్రకటించారు. అయితే పనులు చేయకపోవడంతో మోకాలు లోతు గుంతలతో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తాత్కాలిక మరమ్మతులు చేయించినా వాహనాల తాకిడితో మళ్లీ గుంతలు పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షానికి బురదమయంగా మారింది. కనీసం పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు కూడా వెళ్లేందుకు కష్టంగా మారింది. అంతేకాకుండా పొలాల వద్దకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
అధ్వానంగా పల్లె రోడ్లు
● చందుర్తి మండలం కిష్టంపేట–కట్టలింగంపేట, గుడిపేట–ఎన్గల్, ఎన్గల్–మామిడిపల్లి, చందుర్తి గచ్చుబావి నుంచి నర్సింగాపూర్, రామన్నపేట –ఆశిరెడ్డిపల్లి లింక్ రోడ్ల పనులు నిధులు లేక మరమ్మతులకు నోచుకోవడం లేదు. పదేళ్లుగా మొరం కూడా పోయకపోవడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. కిష్టంపేట–కట్టలింగంపేట రోడ్డు నిర్మిస్తే చందుర్తి మండలంతోపాటు కోనరావుపేట మండలం బావుసాయిపేట, మామి డిపల్లి, నిజామాబాద్, వెంకట్రావ్పేట, కోనరా వుపేట, మల్కపేట, కనగర్తి గ్రామాల ప్రజలకు కోరుట్ల వెళ్లేందుకు రవాణా మెరుగవుతుంది.
● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి నారాయణపూర్ మీదుగా సింగారం వెళ్లే రోడ్డుపై అడుగుకో గుంత పడింది. రాచర్ల గొల్లపల్లి– రాజన్నపేట గ్రామాల మధ్య రోడ్డు మరీ దారుణంగా మారింది.
● ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి నుంచి కోనరావుపేట మండలం శివంగాలపల్లి మధ్య అటవీ ప్రాంతంలో దాదాపు మూడు కిలోమీటర్లు తారు రోడ్డు లేక మట్టి రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
● ముస్తాబాద్ మండలం కొండాపూర్–ఆవునూర్, ఆవునూర్–తంగళ్లపల్లి వెళ్లే రోడ్లు దారుణంగా తయారయ్యాయి.
● వేములవాడ నుంచి బోయినపల్లి మధ్య గల తారురోడ్డు శిథిలమైంది. బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు సీసీ రోడ్లు లేక పల్లె ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఇది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి నారాయణపూర్ మీదుగా సింగారం, బండలింగంపల్లి, ముస్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ఈ రోడ్డుపై అడుగుకో గుంతపడింది. ఈ రోడ్డుపై వెళ్లాలంటే ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.