
కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
గిద్దలూరు రూరల్: మండలంలోని కేఎస్పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా అర్ధవీడులో పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తుంటాడు. ప్రసాద్ తన కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి అందులోని వస్తువులు అపహరించారు. ప్రసాద్ తిరుపతి నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి వెనుక భాగంలో ఉన్న తలుపులు తెరచి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బైక్ ఢీకొని దంపతులకు తీవ్రగాయాలు
మార్కాపురం: టూవీలర్ను వెనుక నుంచి మరో టూవీలర్ ఢీకొట్టడంతో దంపతులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి పట్టణంలోని వై జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. తర్లుపాడు మండలం మంగళికుంట గ్రామానికి చెందిన భార్యభర్తలు షకీలా, నాగేశ్వరరావు వ్యక్తిగత పనిపై మార్కాపురం పట్టణానికి వస్తున్నారు. వారి వెనుకే వస్తున్న మరో టూవీలర్ అదుపుతప్పి భార్యాభర్తలను ఢీకొట్టింది. గాయాలైన సంఘటన చోటుచేసుకుందని పట్టణ పోలీస్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
న్యాయవాదులు
బాధ్యతగా పనిచేయాలి
సింగరాయకొండ: న్యాయవాదులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి న్యాయాన్ని కాపాడాలని హైకోర్టు జడ్జి కె.మన్మథరావు పిలుపునిచ్చారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని గంజి కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఆయనకు ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మన్మథరావు మాట్లాడుతూ దేశంలో కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. ఇటీవల హైకోర్టు జడ్జిలంతా సమష్టి కృషితో కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. తాను ఒక్కడినే 13 వేల కేసులు పరిష్కరించానన్నారు. దీంతో కేసుల పరిష్కారంలో ఏపీకి రెండో స్థానం దక్కిందన్నారు. సింగరాయకొండలో నూతన కోర్టు ఏర్పాటుకు తన కృషి కన్నా ఇక్కడి అవసరాలే కారణమన్నారు. అనంతరం జడ్జి మన్మథరావుకు ఆత్మీయ పౌర సన్మానం చేశారు. సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులనాయుడు, అడ్వకేట్ పంగులూరి గోవిందయ్య, మేకల రామ్మూర్తి, డాక్టర్ కొంపల్లి హెచ్ఎస్ఎస్ సుందర్, డాక్టర్ నూకసాని సుబ్బారావు, అడ్వకేట్ రాయి రమేష్, కొల్లూరి నరసింహారావు, బక్కమంతుల వెంకటేశ్వర్లు, పంతగాని వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.