
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను తాను కలవడంపై వస్తున్న విమర్శలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్రెడ్డి స్పందించారు. తాను మల్లికార్జున ఖర్గేను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, మర్యాద పూర్వకంగా మాత్రమే ఆయన్ను కలిశానని స్పష్టం చేశారు.
ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) ‘సాక్షి’తో మాట్లాడిన ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి.. ‘ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశాను. ఆయన్ను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. 35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గే నాకు సన్నిహితుడు. కర్ణాటక హోం మంత్రిగా ఖర్గే పనిచేసిన దగ్గర్నుంచీ ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది.
సన్నిహితుడు కాబట్టే మర్యాదపూర్వకంగా మాత్రమే ఖర్గేను కలిశాను. రాజకీయాల్లో ఉన్నంత వరకూ మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్తోనే నడుచుకుంటాను. నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని. ఎల్లో మీడియా కావాలని నాపై ఉద్దేశపూర్వక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు.
