ధరల భారం మోపుతున్న మోదీ, కేసీఆర్: షర్మిల
మోత్కూరు, ఆత్మకూరు (ఎం): కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పోటాపోటీగా ప్రజలపై ధరల భారం మోపుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, విద్యుత్, బస్సుచార్జీలను ఉపసంహరించుకోవాలని ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని పారుపల్లి, టి.రేపాక, ఉప్పలపహాడ్, కప్రాయపల్లితో పాటు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో సాగింది.
మోత్కూరులో ఆమె మాటా–ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. యాదాద్రి దేవస్థానం పరిధిలో కేసీఆర్ కుటుంబం వేలాది ఎకరాలను సంపాదించుకుందని, ఆ భూములకు డిమాండ్ కోసం యాద్రాది దేవస్థానం అభివృద్ధిని చేపట్టారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో ప్రతి రైతు సంతోషంగా ఉండేవారని, ఇప్పుడు ఆ సంతో షం లేకుండా పోయిందని షర్మిల అన్నారు.