గంభీర్‌ బాటలో.. ఎన్నికలకు దూరంగా కేంద్ర మాజీ మంత్రి | BJP MP Jayant sinha Tells Wont Contest lok sabha Polls | Sakshi
Sakshi News home page

గంభీర్‌ బాటలో.. ఎన్నికలకు దూరంగా కేంద్ర మాజీ మంత్రి

Mar 2 2024 3:54 PM | Updated on Mar 2 2024 4:42 PM

BJP MP Jayant sinha Tells Wont Contest lok sabha Polls - Sakshi

ఢిల్లీ: బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని.. రాజకీయాల నుంచి వైదొలగానుకుంటున్నట్లు గౌతం గంభీర్‌ ప్రకటించిన వేళ.. మరోనేత అదే రీతిన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సీనియర్‌.. ఎంపీ జయంత్‌ సిన్హా వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.

జయంత్‌ సిన్హా.. గతంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌లోని  హజారీబాగ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.‘నన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతున్నా. నేను ప్రపంచ పర్యావరణ మార్పుల విషయంలో భారత్‌పై పూర్తి దృష్టి సారించాలనుకుంటున్నా. నేను ఆర్థిక, ప్రభుత్వపరమైన విషయాల్లో బీజేపీ పార్టీకి అన్ని రకాలుగా సేవలందిస్తా. 

.. గత పదేళ్లుగా హజారీబాగ్‌కు సేవలు అందించినందుకు గర్వపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్‌ షా, బీజేపీ నాయకత్వం ఆశీస్సులతో చాలా మంచి అవకాశాలు పొందాను. వారందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్‌’ అని జయంత్‌ సిన్హా ఎక్స్‌( ట్విటర్‌) వేదికగా ప్రకటించారు.    

ఐఏఎస్‌ మాజీ అధికారి.. కేంద్ర మాజీ మం‍త్రి యశ్వంత్‌ సిన్హా కుమారుడే జయంత్‌ సిన్హా అని తెలిసిందే. సుదీర్ఘకాలం బీజేపీతో రాజకీయాల్లో ఉన్న యశ్వంత్‌ సిన్హా.. తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. 2022లో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షల తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఇలా  ఇద్దరూ సిట్టింగ్‌ ఎంపీలు తాము వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయమని.. రాజకీయాలకు దూరం ఉంటామని ప్రకటించటం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే మరోవైపు  బీజేపీ ప్రకటించే ఎంపీ అభ్యర్థుల జాబితాలో వీరికి టికెట్‌ లభించకపోవచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకేవారు రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇక..బీజేపీ మొదటి జాబితాలోనే సుమారు వంద మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయ. ఆ దిశగా బీజేపీ రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement