
మానేరులో ఇసుక తోడేళ్లు
ముత్తారం(మంథని): నిబంధనల ప్రకారం వంతెన పియర్లకు సుమారు అర్ధ కిలోమీటరు పరిధిలో ఇసుక తవ్వకాలు నిషేధం. కానీ, పెద్దపల్లి – జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దు మానేరులో ఈ నిబంధనేదీ అమలు కావడం లేదు. పియర్ల చెంతనే మీటర్ల కొద్దీ లోతులో ఇసుక తోడేస్తున్నారు. గతేడాది వీచిన గాలిదుమారానికే వంతెనపై గడ్డర్లు కుప్పకూలాయి. అయినా, ఇసుకాసురులు తవ్వకాలు ఆపడం లేదు. అక్రమార్కులను నిలువరించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏళ్లు గడిచినా పూర్తికాని నిర్మాణం..
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ – జయంశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరుపై వంతెన నిర్మాణానికి రూ.47.7 కోట్లతో 2016 ఆగస్టు 4న శంకుస్థాపన చేశారు. సుమారు తొమ్మిదేళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాలేదు. గతేడాది 2024 ఏప్రిల్ 23న వీచిన బలమైన ఈదురుగాలులకే పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు కుప్పకులాయి. అయితే, కూలిన గడ్డర్లు పనిచేస్తాయా? లేదా అనేదానిపై జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇటీవల నాణ్యతా పరీక్షలు జరిపారు. రీ టెండర్తో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్.. ఏడాది గడుస్తున్నా వంతెన నిర్మాణాన్ని పునఃప్రారంభించలేదు. పియర్ల వద్ద కనీసం ఇసుక తవ్వకాలనూ నిలువరించలేకపోతున్నారు. ఇది ఆర్ అండ్ బీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమనే విమర్శలు ఉన్నాయి.
అడ్డుకోకుంటే వంతెనకే ముప్పు..
పియర్ల సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయకపోతే వంతెనకు ముప్పు పొంచిఉంటుందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పకూలిన గడ్డర్ల కింద ప్రమాదం పొంచిఉంది. అయినా, వాటికిందనే ఇసుక పనులు చేసే కూలీలు సేద తీరుతున్నారు. అక్కడ ప్రమాద సూచికల బోర్టు కూడా ఏర్పాటు చేయలేదు.
నంబర్లు ఉండవు.. రాత్రింబవళ్లు రవాణా
నంబరు ప్లేట్లులేని ట్రాక్టర్లలో అక్రమార్కులు మానేరు నుంచి రాత్రింబవళ్లు ఇసుక తరలిస్తున్నారు. అక్రమార్కులను ఎవరైనా అడ్డుకుంటే దాడులకు తెగబడుతున్నారు. అడ్డుకోవాల్సి అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇసుక తరలింపు ఆపకపోతే పియర్లు కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వంతెన పియర్ల వద్ద జోరుగా తవ్వకాలు
వంతెనకు ముప్పు పొంచి ఉందంటున్న ఇంజినీర్లు
ఇప్పటికే కూలిన గడ్డర్లు.. పట్టించుకోని అధికారులు
అధికారుల కనుసన్నల్లోనే..
ఓడేడ్–గర్మిళ్లపల్లి మానేరుపై రవాణా సౌకర్యం కోసం నిర్మించిన మట్టిరోడ్డు నిర్వాహకులపై చర్యలు తీసుకున్న రెండు జిల్లాల అధికారులు.. మానేరు వంతెన సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమంగా తవ్వుతున్నా కనిపించడం లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజాకీయ పలుకుబడి, అధికారుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అనుమతి లేకుండా మానేరు మధ్యలోంచే కాకుండా వంతెనను ఆనుకుని తాత్కాలిక మట్టిరోడ్డు ఉండటంతో పియర్ల వద్దే రోజూ ఇసుక తోడేస్తూ వందలా ది ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇక్కడ తవ్విన ఇసుకను గర్మిళ్లపల్లి ఆవల.. కలికోటతాళ్లలో నిల్వ చేస్తున్నారు. అక్కడ జేసీబీలతో లారీల్లో లోడ్చేస్తూ వరంగల్, హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.
హెచ్చరించినా ఆపడం లేదు
మానేరు వంతెన పియర్ల వద్ద సుమారు అర్ధ కిలోమీటరు మేర ఇసుక తీయొద్దని హెచ్చరించినా అక్రమార్కులు ఆపడం లేదు. రెండు జిల్లాల పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానికులు దీనిని అడ్డుకోవాలి. కూలిన గడ్డర్లపై జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజినీర్లు ఇటీవల అధ్యయనం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వంతెన పనులు మళ్లీ ప్రారంభిస్తాం.
– జాఫర్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మంథని

మానేరులో ఇసుక తోడేళ్లు

మానేరులో ఇసుక తోడేళ్లు