
సారా నియంత్రణే లక్ష్యంగా కార్డన్సెర్చ్
విజయనగరం క్రైమ్/గుర్లు: సారా నియంత్రణే లక్ష్యంగా జిల్లా కేంద్రంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘కార్డన్ సెర్చ్‘ చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, భద్రత, నేరాల కట్టడితో పాటు సారా అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా చీపురుపల్లి పోలీస్సబ్ డివిజన్ పరిధి గుర్ల పోలీస్ స్టేషన్ పరిధి దేవుని కణపాక గ్రామంలో ఆదివారం ఉదయం 5గంటలకు చీపురుపల్లి సర్కిల్ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారని ఎస్పీ చెప్పారు. స్టేషన్ సీఐ శంకరరావు ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామస్తుల ఇళ్లలోను, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారన్నారు. గ్రామంలో నివాసం ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు, ప్రజల రక్షణకు భరోసా కల్పించేందుకు గుర్ల, గరివిడి, బుదరాయవలస ఎస్సైలు 35 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారని చెప్పారు. గ్రామంలోని అన్ని ఇళ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎంఎస్సీడీ పరికరాలతో తనిఖీ చేశారని చెప్పారు. అదేవిధంగా వారి దగ్గర లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని ఆరు ద్విచక్ర వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. నుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో దిగ్బంధం చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 400లీటర్ల బెల్లం ఊటను గుర్తించి, ధ్వంసం చేశామన్నారు. ఈ ఆపరేషన్లో చీపురుపల్లి సీఐతో పాటు గుర్ల, గరివిడి, బుదరాయవలస ఎస్సైలు పి.నారాయణరావు, లోకేశ్వరరావు, లోకేష్, సిబ్బంది పాల్గొన్నారు.