
ఇంటిపైకి దూసుకెళ్లిన కారు..
● ముగ్గురికి తీవ్రగాయాలు
విజయనగరం గంటస్తంభం/క్రైమ్: విజయనగరం సన్స్కూల్ పక్కన రామకృష్ణ నగర్లో నివాసముంటున్న పట్నాన సత్యవతి ఇంటి పైకి డంపింగ్ యార్డు మీదుగా 15 అడుగుల ఎత్తు నుంచి ఓ కారు దూసుకువచ్చింది. ఈ ఘటనలో పట్నాన సత్యవతి(60), గొడ్డు వినయ్(14), పట్నాన వినయ్(12) కారు కింద ఇరుక్కుపోయారు. దీంతో కాలనీ యువకులు హుటాహుటిన ప్రమాద స్ధలానికి చేరుకుని కారును ఎత్తి వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరావు, ఎం.శాంతమూర్తి పరామర్మించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అర్ధరాత్రి మద్యం తాగుతూ కారును నడిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హైవోల్టేజ్తో కాలిపోయిన టీవీలు
విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని జొన్నగుడ్డి రుప్పవీధిలో హైవోల్టేజ్ రావడంతో సోమవారం ఓ ఇంట్లోని ఫ్యాన్లు, టీవీ, కూలర్, లైట్లు కాలిపోయాయి. అలాగే బట్టలతో సహా అన్నీ కాలిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోవడంతో బాధిత కుటుంబం ఆవేదన చెందుతోంది.
25 లీటర్ల సారా పట్టివేత
సీతంపేట: మండలంలోని కొత్తకోట జంక్షన్ వద్ద 25 లీటర్ల సారా అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు దోనుబాయి ఎస్సై మస్తాన్ తెలిపారు. వీరఘట్టానికి చెందిన శివయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇసుక ట్రాక్టర్..
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతినదిలో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం ఆర్డీఓ జేవీవీఎస్ రామ్మోహనారావు అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనుమతులు లేకుండా ఇసుకను తవ్వి తరలిస్తున్నందుకు గాను ట్రాక్టర్ యజమానకి రూ.10వేల జరిమానా విధించామని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు.
లారీని ఢీకొని ఇద్దరికి గాయాలు
గుర్ల: మండలంలోని అచ్యుతాపురం వద్ద సోమవారం ఇద్దరు యువకులు గాయపడ్డారు. మెరకముడిదాం మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన స్వామి, వాసులు ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్తుండగా అచ్యుతాపురం వద్ద విజయనగరం నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తలపై గాయాల య్యా యి. గుర్ల పీహెచ్సీలో ప్రథమ చికిత్స ఆనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
రెడ్డి ల్యాబ్స్ ఉద్యోగిని ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. పడాల పేటలో ఉంటున్న నడిపేన భారతి, పూసపాటిరేగ వద్ద గల రెడ్డి ల్యాబ్స్లో పని చేస్తోంది. వృత్తిలో పర్మినెంట్ కాలేదని కొన్ని రోజుల క్రితం ఆమె కన్నల్లికి చెప్పింది. చేస్తున్న పనిలో ఒత్తిడి కూడా అధికం అవడం, తల్లికి భారమవుతున్నానన్న బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావించి డ్యూటీ నుంచి రాగానే ఇంట్లోని తన గదిలో తలుపేసుకుని ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఈ మేరకు భారతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇంటిపైకి దూసుకెళ్లిన కారు..

ఇంటిపైకి దూసుకెళ్లిన కారు..

ఇంటిపైకి దూసుకెళ్లిన కారు..