
43 అట్రాసిటీ కేసుల్లో పరిహారం చెల్లింపు
పార్వతీపురం టౌన్: జిల్లాలో నమోదైన 43 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రూ.48.42 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో 40 కేసులకు సంబంధించి రూ.54.50 లక్షల చెల్లింపు పెండింగ్లో ఉందని, ఆరు కేసుల్లో విచారణ కొనసాగుతోందని వివరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే అన్ని వసతి గృహాలు, పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొదటిరోజు నుంచే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి తగిన పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు కులధ్రువీకరణ పత్రం జారీకి ఆదేశాలు జారీచేశామన్నారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడిన వివాదాల కారణంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తే కేసులకు ముగింపు పలకవచ్చని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో జిల్లా స్థాయి అధికారులను సభ్యులుగా నియమించాలని కోరారు. కులా న్ని అడ్డంగా పెట్టుకుని కేసులకు వాడుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, ఏఎస్పీ అంకిత సురాన, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎండీ గయాజుద్దీన్, జలవనరుల కార్యనిర్వాహక ఇంజినీరు ఆర్. అప్పలనాయుడు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.వినోద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భయం..భయం
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో గరుగుబిల్లి మండలంలోని నందివానివలస, సుంకి, సంతోషపురం, గొట్టివలస గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోడ్లపైన, గ్రామానికి సమీపంలో సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏ ముప్పు తలపెడుతాయోనని భయపడుతున్నారు. తక్షణమే ఏనుగుల తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పదోతరగతి పరీక్షల
మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం
● ప్రభుత్వ తొందరపాటు చర్యలతో
వేలమంది జీవితాలపై తీవ్ర ప్రభావం
● రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు
● విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
విజయనగరం గంటస్తంభం: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, విద్యారంగాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు దుయ్యబట్టారు. అమర్ భవన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్మి ఎన్.నాగభూషణం మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేశారు. ఎన్నడూలేని విధంగా పరీక్షలు పూర్తయిన 22 రోజులకే ఫలితాలు విడుదల చేశామని విద్యాశాఖమంత్రి గొప్పలు చెప్పు కున్నారు. తీరా ఈ ఫలితాల్లో చాలామంది విద్యార్థులు అసహనం చెందడంతో పాటు మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రచారం ఆర్భాటంలో ఉన్న శ్రద్ధ ఫలితాల విడుదలలో చూపలేదు. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 66,363 మంది విద్యార్ధులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేస్తే.. ఫెయిలైన 11,000 మంది పైచిలుకు విద్యార్థులు పాసయ్యారు. చాలా మందికి సబ్జెక్టు మార్కుల శాతం భారీగా పెరిగాయి. ప్రభుత్వం తప్పుడు ఫలితాలు ఇవ్వడం వల్ల చాలామంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు కూడా కోల్పోయారని వాపోయారు.

43 అట్రాసిటీ కేసుల్లో పరిహారం చెల్లింపు