
హాస్టల్ ఏర్పాటు చేయాలి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి పరిధి మునుష్గా పంచాయతీలోని కొడిగుడ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు రజత్ మదల కోరారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి రాజధానికిలోని రాష్ట్ర ఆదివాసీ, హరిజన వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండొకు గురువారం వినతిపత్రం అందజేశారు. కాసీపూర్ సమితిలో విద్యావిధానం మరింత మెరుగుపరచాలని, అదేవిధంగా ఆస్పత్రి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ప్రయాణికునికి ఫోన్ అప్పగింత
భువనేశ్వర్: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని ఎయిర్ కండిషన్డ్ బోగీలో ప్రయాణికుడు మరిచిపోయిన ఫోనుని భద్రంగా సంబంధీకులకు అప్పగించి టికెటు తనిఖీ సిబ్బంది సేవాభావం చాటుకున్నాడు. హౌరా నుంచి ఖుర్దారోడ్ వరకు టికెటు తనిఖీ విధులు నిర్వహించిన చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లక్ష్మీధర మహంతి సత్వర స్పందనతో ఇది సాధ్యమైంది. ఎం–4 ఎయిర్కండిషన్ బోగీలో ప్రయాణించి వ్యక్తి విలువైన మొబైల్ ఫోను మర్చిపోయి జాజ్పూర్ కెంజొహర్ రోడ్ రైల్వే స్టేషనులో దిగిపోయాడు. రైలు బయల్దేరిపోవడంతో రైల్వే శాఖ సహకారంతో టికెటు తనిఖీ అధికారికి సమాచారం చేరదీయడంతో విధి నిర్వహణలో ఉన్న అధికారి తక్షణమే గాలించి ఆ వ్యక్తి ప్రయాణించిన సీటులో మొబైలు ఫోన్ గుర్తించి తెలియజేయడంతో తదుపరి రైల్వే స్టేషన్లో ఫోను మరిచిపోయిన ప్రయాణికుని బంధువు కటక్ రైల్వే స్టేషన్కు చేరి సంబంధిత చీఫ్ టికెట్ నుంచి మొబైల్ ఫోను తిరిగి పొందగలిగాడు.
వివాహిత దారుణ హత్య
జయపురం: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు పిన్ని వరుస మహిళను కామించి ఆమె నిరాకరించటంతో హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ సంఘటన జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధి జయంతగిరి–మినాగుడ మార్గంలో బుధవారం జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
మినాగుడ గ్రామం డొంబు పెంటియ తనకు పిన్ని వరుస అయిన రుక్మిణీ పెంటియపై కన్నువేశాడు. శారీరక సంబంధం కోసం ఆమెను వేధించసాగాడు. బుధవారం రుక్మిణీ పెంటియ జయపురంలో బంగారు నగలు కొనేందుకు బయల్దేరింది. విషయం తెలుసుకున్న డుము పెంటియ జయంతిగిరి–మినాగుడ మార్గంలో ఆమెను అడ్డగించాడు. డొంబు కోరికను ఆమె నిరాకరించడంతో అతడు కోపంతో కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె పడిపోయింది. స్థానికులు గమనించి ఆమెను కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య విద్యాలయ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. రుక్మిణి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై బొరిగుమ్మ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బొరిగుమ్మ పోలీసు అధికారి శ్వేత పద్మ సెట్టి వెల్లడించారు. రుక్మిణి భర్త మానసిక రోగి కావటం వల్ల, ఆ అవకాశాన్ని తీసుకొని ఆమెను తన వశం చేసుకోవాలని డొంబు పెంటియ ప్రయత్నించి విఫలమై ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసు అధికారి తెలిపారు.

హాస్టల్ ఏర్పాటు చేయాలి