
విశ్రాంత కార్మికులకు బకాయి బాధ
జయపురం: జయపురం గగణాపూర్ సేవా పేపరుమిల్లు విశ్రాంత కార్మికుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అతడి కుటుంబ సభ్యులు జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చేర్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మరో చోటకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. కానీ అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారు ఏం చేయాలో తెలీక తల్లడిల్లుతున్నారు. సేవా యూనియన్ నేత ప్రమోద్ కుమార్ మహంతి వివరిస్తూ.. సేవా పేపరుమిల్లు విశ్రాంత కార్మికుడు బి.ముత్యాల రావు కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడని, ముత్యాల రావు కుమారులు తన తండ్రికి రావాల్సిన గ్రాడ్యుటీ, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని అభ్యర్థించారని, అయితే యాజమాన్యం కేవలం రూ.10వేలు మాత్రమే అందజేసిందన్నారు. రానున్న రెండు నెలల్లో బకాయిలు అందజేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ ముత్యాల రావు చికిత్సకు రూ.లక్షల్లో డబ్బు అవసరమవుతుందని, చాలా మంది విశ్రాంత కార్మికులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సకాలంలో యాజమాన్యం విశ్రాంత కార్మికులకు బకాయిలు చెల్లించనందున తగిన వైద్యం అందక ఇటీవల 30 మందికి పైగా మరణించారని ఆయన వెల్లడించారు. ఇప్పటికై నా మిల్లు యాజమాన్యం విశ్రాంత కార్మికుల పట్ల మానవతా దృష్టితో తక్షణ సహాయం అందజేయాలని కోరారు. బకాయి ఉన్న డబ్బు వెంటనే చెల్లించి సహకరించాలని కోరారు.