
రాష్ట్రంలోకి ‘నైరుతి’
భువనేశ్వర్:
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందస్తుగానే బుధవారం ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలు కాగా, రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. రుతుపవనాల ఆగమనంతో వడగాడ్పుల పరిస్థితుల నుంచి ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. రుతుపవనాలు తొలుత మల్కన్గిరి, కొరాపుట్ జిల్లాల్లో విస్తరించాయి. కలహండి, రాయగడ, గజపతి జిల్లాలకు పాక్షికంగా తాకాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రకారం బాలాసోర్, జాజ్పూర్, గంజాం జిల్లాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం జారీ చేసింది.
హెచ్చరికలు జారీ..
రాష్ట్రంలో 9 జిల్లాలకు ఎల్లో అలెర్చ్ హెచ్చరిక జారీ అయింది. ఈ జాబితాలో ఖుర్ధా, నయాగఢ్, బౌధ్, కంధమల్, కలహండి, గంజాం, రాయగడ, ఝార్సుగుడ, సుందర్గఢ్ జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం వచ్చే అవకాశముంది.జగత్సింగ్పూర్, పూరీ, కటక్, కొరాపుట్, మల్కన్గిరి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, చేపల వేట కోసం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
అల్ప పీడనం..
రాష్ట్ర తీరం వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ వ్యవస్థ నెమ్మదిగా ఉత్తరం వైపు కదిలి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
విస్తారంగా వానలు
పర్లాకిమిడి: రుతు పవనాల ద్రోణి ప్రభావంతో గజపతి జిల్లాలో కాశీనగర్, గుమ్మా, పర్లాకిమిడి, ఆర్.ఉదయగిరి, మోహనా, నువాగడ సమితుల్లో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది. మహేంద్రతనయ, వంశధారలో నీరు చేరింది. ఈ ఏడాది ఖరీఫ్కు విత్తనాలు వేయడానికి రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఈ ద్రోణి వల్ల ఈ నెల 30 వరకూ రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని మాజీ ఐఎండీ వాతావరణ నిపుణులు డా.శరత్ చంద్ర సాహు తెలిపారు.
రాయగడ: వర్షాకాలంలోఉరుములు, మెరుపులు కురిసే సమయంలో ప్రాణ సంకటంగా మారుతున్న పిడుగులపై ప్రజలను చైతన్యపరిచేందుకు చైతన్య, ప్రచార రథాన్ని కలెక్టర్ ఫరూల్ పట్వారి ప్రారంభించారు. జిల్లాలో 11 సమితుల్లో ఈ రథం తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాయగడ జిల్లాలో ఇటీవల కాలంలో పిడుగుపాటు మృతులు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్త చర్యలను వివరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో, ఏడీఎం రమేష్చంద్ర నాయక్, గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్దీప్ కౌర్ సహాట, రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్నా, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, జిల్లా సామాజిక సురక్షా శాఖ అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.
ముందస్తుగా
ప్రవేశించిన రుతుపవనాలు
విస్తారంగా వర్షాలకు అవకాశం
అప్రమత్తం చేస్తున్న అధికారులు

రాష్ట్రంలోకి ‘నైరుతి’

రాష్ట్రంలోకి ‘నైరుతి’

రాష్ట్రంలోకి ‘నైరుతి’