
డాక్టర్ రోహిత్ కుమార్ కుండు అరెస్టు
రాయగడ: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రోహిత్ కుమార్ కుండును ఒక చోరీ కేసుకు సంబంధించి నిందితుడిగా అనుమానించిన సదరు పోలీసులు అరెస్టు చేశారు. అయనతో పాటు మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సదరు పోలీస్స్టేషన్ ఐఐసీ కేకేబీకే కుహరో తెలిపిన వివరాల మేరకు.. అక్టోబర్ 29వ తేదీన స్థానిక రింగ్ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ అర్బన్ ఆస్పత్రి సమావేశ మందిరంలో చోరీ జరిగింది. దీంతో ఆస్పత్రి మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సంగ్రమ్ కిషోర్ నిమల ఈ మేరకు సదరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమావేశ మందిరంలోని ల్యాప్టాప్, సీసీటీవీకి సంబంధించిన హర్డ్డిస్క్తో పాటు మరికొన్ని కీలకమైన పత్రాలు, రిజిస్ట్రార్లు దొంగిలించబడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అర్బన్ ఆస్పత్రిలో కొంతమంది సిబ్బందిని విచారించిన అనంతరం ఈ కేసుకు సంబంధించి డాక్టర్ రోహిత్ కుమార్ కుండుతో పాటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్న అమూల్య సావుంత, దేవశీష్ గొరొడియాలను సైతం శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
● మెడికల్ అధికారిగా విధులు
ఇదిలాఉండగా కొద్ది నెలల క్రితం డాక్టర్ కుండు అర్బన్ ఆస్పత్రిలో మెడికల్ అధికారిగా విధులు నిర్వహించారు. అయితే విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన జిల్లా కేంద్రాస్పత్రి అధికారులు డాక్టర్ మమత చౌదరి, డాక్టర్ సుబుద్ధిలు జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ లాల్ మెహన్ రౌత్రాయ్కు సమర్పించిన నివేదిక ప్రకారం అతనిపై చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా అర్బన్ ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి బదిలీ చేశారు.