
బుడమేరుకు అవినీతి గండ్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరుకు ‘అవినీతి’ గండ్లు పడ్డాయి. నిబంధనలు పాటించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు జీ హుజార్ అంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు వారికి దాసోహమంటున్నారు.
అధికారులు నిబంధనలు పక్కన పెట్టి నోటి మాటలతో బుడమేరుకు సంబంధించి రూ. 43.91 కోట్ల పనులను అప్పనంగా ఇచ్చేశారు. సాంకేతిక అనుమతి లేకుండా.. పరిపాలన అనుమతి జారీ కాకుండానే, కనీసం వర్క్ అర్డర్ ఇవ్వకుండానే.. నోటి మాటపై 40 మంది కాంట్రాక్టర్లలకు రూ.43.91 కోట్ల విలువైన 126 పనులు పప్పుబెల్లాల్లా పంచేశారు. వెంటనే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభింపచేశారు. తూతూ మంత్రంగా పనులు కానిచ్చేసి. బిల్లులు చేసుకొని కోట్లాది రూపాయలు దోచుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో మైలవరం ప్రజాప్రతినిధికి అక్రమాల ‘కిశోరం’.. అవినితి ‘కోటీశ్వరుడు’ దళారులుగా వ్యవహరించి 15 శాతం కమీషన్ వసూలు చేశారు. కీలక మంత్రి నుంచి మైలవరం ప్రజాప్రతినిధి వరకు ముడుపులు అందడంతో ఆ పనులకు టెండర్లు నిర్వహించలేదని అధికార వర్గాలే వాపోతున్నాయి. టెండర్లు నిర్వహిస్తే మట్టి పనులు కాబట్టి కనీసం 25–30 శాతం నిధులు ఆదా అయ్యేవని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆకాశమే హద్దుగా సాగుతున్న అక్రమాలకు బుడమేరు మరమ్మతులు వేదిక అయ్యాయి. అక్రమాల కథాకమామీషు ఇది.
ఇన్నాళ్లూ ఊరుకుని వర్షాలు వచ్చే ముందు పనులు
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి పెను విపత్తుకు దారి తీసింది. దీంతో 126 చోట్ల గండ్లు పడి విజయవాడను ముంచెత్తింది. అపార ఆస్తి నష్టం వచ్చింది. నాడు బుడమేరు సమస్య లేకుండా చూస్తామని సీఎం చంద్రబాబు ఊదరగొట్టారు. ఎమ్మెల్యేలూ ఆయన బాటలోనే నడిచారు. వర్షాకాలం అక్టోబరు ఆఖరుతో పూర్తైంది. వెంటనే బుడమేరు గండ్లు పూడ్చివేత, మరమ్మతులు, ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేయాల్సి ఉంది. కానీ మిన్నకుండిపోయింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి చెదురు మదురుగా వర్షాలు కురుస్తున్న సమయంలో బుడమేరు గండ్లు పూడ్చివేత, మరమ్మతులకు శ్రీకారం చుట్టడాన్ని చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిలో డొల్లతనం వెల్లడవుతోంది.
హడావుడిగా నామినేషన్పై పనులు
ప్రభుత్వం పని మంజూరు చేయాలంటే క్షేత్ర స్థాయిలో ప్రాథమిక కొలతలు తీసుకోవాలి. పనులు ఏ పరిమాణంలో చేయాలన్నది నిర్ధారించి అంచనా వ్యయం లెక్క కట్టాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపాలి. వాటికి పరిపాలన అనుమతి ఇచ్చాక, వాటిని చేయడానికి ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీర్) సాంకేతిక అనుమతి జారీ చేయాలి. దీంతో ఆ పనులకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించాలి.
అప్పుడు మాత్రమే..
ఏదైనా విపత్తు సంభవించినప్పుడు యుద్ధ ప్రతిపాదిన దాని అధిగమించడానికి చేపట్టాల్సిన పనులు, అదీ రూ.10 లక్షలలోపు అంచనా వ్యయం ఉంటే వాటిని కాంట్రాక్టర్లకు నామినేషన్పై అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ నవంబరు నుంచి మే వరకు బుడమేరు మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం స్పందించలేదు.
మరమ్మతులకు నోటిమాటపై 40 మందికి రూ.43.91 కోట్ల విలువైన 126 పనులు అప్పగింత మైలవరం ప్రజాప్రతినిధి.. అధికారులపై ఒత్తిడితెచ్చి సన్నిహితులకు పనులు కట్టబెట్టిన వైనం! 15 శాతం కమీషన్ వర్క్ ఆర్డర్, సాంకేతిక, పరిపాలన అనుమతులు లేకుండా పనులు ప్రారంభం తర్వాత ఈ నెల 5న పరిపాలన అనుమతి ఈ అక్రమాలపై విజిలెన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు, జల వనరుల ఉన్నతాఽధికారుల ఫిర్యాదు

బుడమేరుకు అవినీతి గండ్లు