
వాటర్ హీటర్ షాక్తో వృద్ధురాలి మృతి
ఖలీల్వాడి: నగరంలోని వినాయక్నగర్లో వాటర్ హీటర్ షాక్తో రా థోడ్ వీణ(61) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ జిల్లా నాళేశ్వర్ మండలం పుష్పల్ గ్రామంలోని దుర్గా తండాకు చెందిన రాథోడ్ వీణ ఐదేళ్లుగా కూలీ పని చేసుకుంటూ వినాయక్నగర్లో నివాసం ఉంటోంది. గురువారం ఉదయం వీణ స్నానం చేసేందుకు వాటర్హీటర్ను బకెట్లో పెట్టి కొంత సమయం తర్వాత నీళ్లు వేడిగా మారాయో? లేదో తెలుసుకునేందుకు చేతిని నీటిలో పెట్టింది. విద్యుత్ షాక్ తగలడంతో కేకలు వేస్తూ పడిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కోడలు రాథోడ్ రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జీజీహెచ్లో ఫిట్నెస్ సర్టిఫికెట్లకు ఇక్కట్లు
నిజామాబాద్ నాగారం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో వైద్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అమర్నాథ్ యాత్రికులు గురువారం జీ జీహెచ్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భక్తుడు ధాత్రిక రతన్ మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చిన భక్తులను ఏడంతస్తుల మేడలో కిందకు, పైకి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. జీజీహెచ్ అధికారులు, సూపరింటెండెంట్ స్పందించి భక్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
మాచారెడ్డి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను గురువారం సీజ్ చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పాల్వంచ మండలం బండరామేశ్వరపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో వెళ్లి ట్రాక్టర్ను సీజ్ చేశామన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.