
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని గుండెనెమ్లి గ్రామానికి చెందిన గడ్డి బాలబోయి(48) శుక్రవారం మంజీరలో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో శనివారం భార్య బందెవ్వ మంజీరకు వెళ్లి చూడగా బాలబోయి మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీట మునిగి చనిపోయినట్లు తెలిపారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశామన్నారు.
జీజీహెచ్లో గుర్తు తెలియని మహిళ..
నిజామాబాద్నాగారం: ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్సై రఘుపతి శనివారం తెలిపారు. నగరంలోని దేవీరోడ్లో గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు డయల్ 100కు కాల్ చేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ 1 బ్లూకోల్ట్ సిబ్బంది ఆ మహిళను గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మహిళ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి వయసు సుమారు 40 వరకు ఉంటుందని, వంకాయ కలర్ చీర, నీలి రంగు జాకెట్ ధరించి ఉందన్నారు. మహిళ సమాచారం ఎవరికై నా తెలిస్తే వన్టౌన్లో సంప్రదించాలని సూచించారు.