అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

May 1 2025 1:54 AM | Updated on May 1 2025 1:54 AM

అంతర్

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

14 బైక్‌లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన

నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

నల్లగొండ: బైక్‌లు చోరీ చేస్తున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం వాడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి, వారి నుంచి 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన నలమాల ఎర్రబ్బాయి అలియాస్‌ లూథర్‌, అదే గ్రామానికి చెందిన గంజి అంకమరావు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపహాడ్‌ గ్రామానికి చెందిన వట్టిపల్లి శ్రీకాంత్‌ ముఠాగా ఏర్పడి బైక్‌లు చోరీ చేసి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. నలమాద ఎర్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, దామరచర్ల, నార్కట్‌పల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు ఏపీలోని మార్టూరు, పొన్నూరులో ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, వైన్స్‌లు, రాత్రివేళ ఇళ్ల ముందు పార్కింగ్‌ చేసిన బైక్‌లను చోరీ చేసి వాటిని గంజి అంకమరావు, మట్టిపల్లి శ్రీకాంత్‌తో కలిసి తక్కువ ధరకు విక్రయించేవాడు. బుధవారం ఉదయం వాడపల్లి ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రబ్బాయి, అంకమరావు చోరీ చేసిన బైక్‌లను అమ్మడానికి దామరచర్ల నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా.. అనుమానం వచ్చి ఎస్‌ఐ వారిని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు మట్టిపల్లి శ్రీకాంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు, ఏడు పల్సర్‌ బైక్‌లు, ఒక షైన్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.26.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు నిందితులపై వాడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో 3, నల్లగొండ వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషనల్లో ఒక్కోటి చొప్పున, నార్కట్‌పల్లి పీఎస్‌లో 2, ఇబ్రహీంపట్నం పీఎస్‌లో 1, ఏపీలోని మార్టూర్‌ పీఎస్‌లో 2, పొన్నూరు పీఎస్‌లో 1, రాజమండ్రిలో 1 కేసు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. మొత్తం 22 బైక్‌లు దొంగిలించినట్లుగా నిందితులు అంగీకరించారని, మిగతా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ రూరల్‌ సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌, సీసీఎస్‌ సీఐ డానియేల్‌, వాడపల్లి ఎస్‌ఐ ఎ. శ్రీకాంత్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది సతీష్‌, భాస్కర్‌, వెంకటేశ్వర్లు, రషీద్‌, సీసీఎస్‌ సిబ్బంది విష్ణువర్ధనగిరి, రాంప్రసాద్‌, పుష్పగిరి, శ్రీనివాస్‌రెడ్డిని ఎస్పీ అభినందించారు.

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌1
1/1

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement