
చెరువు శిఖం ఆక్రమణ పరిశీలన
శాలిగౌరారం : మండలంలోని మాధారంకలాన్లో ఆక్రమణకు గురైన రామసముద్రం చెరువు శిఖం భూమిని నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి శనివారం పరిశీలించారు. చెరువు ఆయకట్టు రైతులు చెరువు శిఖం ఆక్రమణపై కలెక్టర్, ఎస్పీలతోపాటు ముఖ్యమంత్రికి రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశానుసారం నల్లగొండ ఆర్డీఓ ఆశోక్రెడ్డి శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, తహసీల్దార్ యాదగిరి, ఎస్ఐ సైదులు, మండల సర్వేయర్ పద్మ, నీటిపారుదలశాఖ ఏఈ విక్రమ్ ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూమిని పరిశీలించారు. ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూమిని స్వాధీన పరుచుకొని చెరువు శిఖం హద్దు వరకు గోతిని తవ్వేందుకు జేసీబీని పిలిపించారు. చెరువు హద్దును నిర్ణయించే క్రమంలో వరికుప్పల జానకమ్మ, ఆమె కుటుంబీకులు జేసీబీని అడ్డుకోవడంతో పాటు ఆర్డీఓతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ఇద్దరిపై కేసు నమోదు
ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూమి స్వాధీన పరుచుకునేందుకు ఆర్డీఓ ప్రయత్నించగా వరికుప్పల జానకమ్మ, వరికుప్పల శ్రీనివాసు కలిసి అధికారులకు అడ్డుగా నిలిచి వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దీనిపై తహసీల్దార్ యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదులు వివరించారు.