
ఇందిరమ్మా.. ఇదేమిటమ్మా!
ఇళ్ల నిర్మాణానానికి నిబంధనల చిక్కులు
● 600 చదరపు అడుగుల్లోనే
నిర్మించుకోవాలంటున్న అధికారులు
● అంతకు మించితే బిల్లులు
ఇవ్వమని స్పష్టీకరణ
● పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న
గ్రామాల్లో కొంత సడలింపు
● అయోమయంలో లబ్ధిదారులు
● నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నవీ
నత్తనడకనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్లకు నిబంధనల చిక్కు వచ్చింది. సొంత స్థలం ఉన్న పేదలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి తాము కొంత కలుపుకొని ఇంటిని పెద్దగా నిర్మించుకుందామంటే.. నిబంధనలు ఒప్పుకోమంటూ అధికారులు చెబుతుండడంతో లబ్ధిదారులు గందరగోళంలో పడ్డారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఇళ్లు మంజూరైన గ్రామాల్లోని లబ్ధిదారులకు ఈ నిబంధనల నుంచి ఊరట లభించినా.. మిగతా వారికి మంజూరైన ఇళ్ల విషయంలో నిబంధనలను పక్కాగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా అమలు
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ప్రతి నియోజక వర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. దాంతో జిల్లాలో మొత్తం 19,698 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసింది. ఆ గ్రామంలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇళ్లను కేటాయించింది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో 1753 ఇళ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణాలు కొన్ని బేస్మెంట్ స్థాయిలో ఉంటే, మరికొన్ని రూప్ స్థాయిలో ఉన్నాయి.
250 ఇళ్లకు బిల్లులు చెల్లింపు
జిల్లాలో 350 ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ స్థాయిలో ఉండగా, మూడు ఇళ్లు రూప్ లెవల్కు చేరకున్నాయి. మిగిలినవి ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. వాటిల్లో 250 ఇళ్లకు ఇప్పటికే మొదటి విడత బిల్లును హౌసింగ్ అధికారులు మంజూరు చేశారు.
లబ్ధిదారుల అయోమయం
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేసిన సమయంలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు లబ్ధిదారులు కొంత డబ్బును కలుపుకొని ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు రూ.5 లక్షలతో 600 చదరపు అడుగలలోనే (ఎస్ఎఫ్టీ) ఇల్లు నిర్మించాలనే నిబంధన విధించింది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో కొందరు 600 ఎస్ఎఫ్టీకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే వారు కింద ఎంత వెడల్పులో నిర్మాణం చేపట్టినా.. పైన స్లాబ్ లెవల్లో మాత్రం 600 ఎస్ఎఫ్టీలోపే నిర్మించుకుంటామని రాత పూర్వకంగా లేఖలు ఇచ్చిన వారికి మొదటి విడత బిల్లులు చెల్లించారు. మిగిలిన ఇళ్ల విషయంలో మాత్రం 600 ఎస్ఎఫ్టీకి మించితే బిల్లులు ఇచ్చేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో లబ్ధిదారులు నిర్మాణాల విషయంలో అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి తోడు మరికొంత అప్పు చేసి ఇంటిని పెద్దగా నిర్మించుకోవాలన్న ఆలోచనల్లో ఉన్నా.. కానీ ప్రభుత్వ నిబంధన వారిని ఇరకాటంలోకి నెట్టింది.
600 ఎస్ఎఫ్టీలోపు నిర్మించాలి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉంటేనే బిల్లులు మంజూరవుతాయి. 600 ఎస్ఎఫ్టీకి మించి నిర్మాణాలు చేయొద్దు. అంతకు మించితే చెల్లింపులకు నిబంధనలు ఒప్పుకోవు. ప్రతి లబ్ధిదారుడు నిబంధనల ప్రకారం ఇంటిని నిరించుకోవాలి.
– రాజ్కుమార్, హౌసింగ్ పీడీ
17,945 ఇళ్లకు ప్రొసీడింగ్స్
పైలెట్ ప్రాజెక్టులో మంజూరు చేసిన ఇళ్లు పోగా, మిగిలిన 17,945 ఇళ్ల నిర్మాణాలకు జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రొసీడింగ్స్ అందజేసింది. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు గుర్తించిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయిలో గెజిటెడ్ అధికారులు పరిశీలించి ఫైనల్ చేసి, ఆ జాబితాను జిల్లాస్థాయికి పంపితే కలెక్టర్ ఆమోదంతో ఇన్చార్జి మంత్రికి పంపించారు. ఆయన ఆమోదంతో ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రొసీడింగ్స్ అందజేశారు. మునుగోడు, దేవరకొండ నియోజక వర్గాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలు ముగ్గు పోసి నిర్మాణాలు ప్రారంభిస్తుండగా నల్లగొండ, ఇతర నియోజక వర్గాల్లో లబ్ధిదారులే ముగ్గు పోసుకొని ఇళ్లను నిర్మించుకుంటున్నారు.

ఇందిరమ్మా.. ఇదేమిటమ్మా!