
ఎక్కడి రైళ్లు అక్కడే..!
● బోయపల్లి గేట్ వద్ద
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
● 4 గంటల పాటు పలు రైళ్ల
రాకపోకలకు అంతరాయం
● నిలిచిపోయిన హంద్రీ, బెంగ ళూరు,
చైన్నె ఎగ్మోర్, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్,
వందే భారత్ రైళ్లు
● తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు
● రాత్రి 10 గంటల తర్వాత
రైళ్ల పునరుద్ధరణ
స్టేషన్ మహబూబ్నగర్/ మదనాపురం/ జడ్చర్ల టౌన్ : జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి బోయపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రామగుండం నుంచి ఎరువులతో తమిళనాడు వెళుతున్న గూడ్స్ రైలుకు సంబంధించిన ఒక బోగి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. హైదరాబాద్ కాచిగూడ నుంచి యాక్షన్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ)ను తెప్పించి.. మరమ్మతులు చేసి రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా.. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు, డెస్క్లను ఏర్పాటు చేసింది. కర్నూలు వైపు వెళుతున్న హంద్రీ ఎక్స్ప్రెస్ను జడ్చర్ల రైల్వే స్టేషన్లో, చెంగల్పట్టు (చైన్నె ఎగ్మోర్) దివిటిపల్లి వద్ద, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ను (తిమ్మాపూర్) వద్ద, కాచిగూడ–మైసూరు (బెంగుళూరు ఎక్స్ప్రెస్)ను బాలానగర్ స్టేషన్లో, వందేభారత్ డోకూరు స్టేషన్లో, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కౌకుంట్ల స్టేషన్లో, యశ్వంత్పురా వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లను మదనాపురం స్టేషన్లో, అలోక్ స్పెషల్ కర్నూలులో, గూడ్స్ రైలును గొల్లపల్లి స్టేషన్లో నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయని గుర్తించి హంద్రీ ఎక్స్ప్రెస్లో 70 శాతం మంది ప్రయాణికులు వెళ్లిపోయారు. ఆటోల్లో బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. వెంకటాద్రి, బెంగళూరు ఎక్స్ప్రెస్లలోని ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోగా..గుంటూరు రైలుకు వచ్చే ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు కాశారు. దివిటిపల్లి, మదనాపురం, కౌకుంట్ల స్టేషన్లలో రైళ్లను నిలిపివేయడం వల్ల తిండి లేక చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడ్డారు.
వనపర్తి రైల్వేస్టేషన్లో నిలిచిన వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లు
రైలులో జ్వరంతోనే..
ఎమ్మిగనూరు గంజిల గ్రామానికి చెందిన కె.లక్ష్మి అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జి అయి స్వగ్రామానికి వెళ్లేందుకు భర్త పెద్దలింగన్నతో కలపి హంద్రీ ఎక్స్ప్రెస్ ఎక్కింది. జడ్చర్ల స్టేషన్లో రైలు నిలవటంతో ఇబ్బందులు పడ్డారు. జ్వరం రావడంతో మాత్రలు వేసుకుని రైలులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మూడు నెలల తర్వాత ఇంటికి వెళ్దామంటే ఇలా ఇబ్బందులు వస్తాయని అనుకోలేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యలో నిలిపేస్తే ఎలా..?
కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.? – శివమూర్తి, కర్నూలు

ఎక్కడి రైళ్లు అక్కడే..!

ఎక్కడి రైళ్లు అక్కడే..!

ఎక్కడి రైళ్లు అక్కడే..!