
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
ఏటూరునాగారం: ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి సీతక్క అనుచరులు ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని పుర వీధుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ప్రశ్నించినందుకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా అతనిని బెదిరించి సెల్ఫోన్ లాక్కోవడం జరిగిందన్నారు. తర్వాత బెదిరింపులకు దిగడంతో మనస్తాపానికి గురైన చుక్కా రమేష్ గురువారం వారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రశ్నిస్తున్న వారిపై భౌతికదాడులు, బెదిరింపులకు దిగి మానసికంగా ఇబ్బందులకు గురిచేసి చంపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వీటికి మంత్రి సీతక్కను బాధ్యులను చేస్తూ మంత్రి పదవి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా విషయం తెలుసుకున్న ఎస్సై రాజ్కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నాగజ్యోతితో పాటు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్కుమార్, తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, ఎండి ఖాజా పాషా, దన్నపునేని కిరణ్, సప్పిడి రాంనరసయ్య, గండేపల్లి నర్సయ్య, కుమ్మరి చంద్రబాబు, జాడి బోజారావు, తురం పద్మ, వావిలాల ముత్తయ్య, దేపాక శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్
బడే నాగజ్యోతి