రెస్క్యూ.. సెవెన్‌ అవర్స్‌! | - | Sakshi
Sakshi News home page

రెస్క్యూ.. సెవెన్‌ అవర్స్‌!

Jun 9 2025 7:47 AM | Updated on Jun 9 2025 7:47 AM

రెస్క

రెస్క్యూ.. సెవెన్‌ అవర్స్‌!

కాళేశ్వరం: సమీప బంధువు వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను ఏడు గంటల పాటు రెస్క్యూ సెర్చ్‌ ఆపరేషన్‌లో వివిధ బృందాల గాలింపుతో పోలీసులు త్వరగా కనుగొన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలోవివాహ వేడుకలు ముగిసిన తర్వాత సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ చూద్దామని సరదాగా శనివారం సాయంత్రం ఆరు గంటలకు సొంత ఆటోలో పట్టి వెంకట్‌స్వామి అతడి ఇద్దరు కుమారులు, మరో ఐదుగురితో కలిసి వెళ్లారు. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ అప్‌స్ట్రీమ్‌ మూడో బ్లాక్‌ వద్ద గోదావరి లోతు ప్రాంతంలో ఈతకు దిగిన ఏడుగురిలో ఆరుగురు గల్లంతయ్యారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు.

కవలల్లో ఒకరు మృతి

అంబట్‌పల్లికి చెందిన సమ్మయ్యకు కుమారుడు కర్ణాల సాగర్‌(16), స్రవంతి కవలలు. వారిద్దరూ ఇంటర్‌ చదువుతున్నారు. సాగర్‌ మృతి చెందడంతో సోదరి కన్నీటి ధారలతో వీడ్కోలు పలికింది. వారిదీ కూలీ కుటుంబమే.

కొడుకు మరణంతో..

మల్హర్‌ మండలం మల్లారానికి చెందిన తొగరి రాజయ్య–సాంబ దంపతుల కుమారుడు తొగరి రక్షిత్‌(13) 9వ తరగతి చదువుతున్నాడు. వారు అంబట్‌పల్లిలోనే నివాసం ఉంటున్నారు. కూలీ పని చేస్తూ జీవించే వీరికి కుమార్తె కూడా ఉంది. రక్షిత్‌ మృత్యువాత పడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి సాంబ రోదనలు మిన్నంటాయి.

కొడుకు మృతితో..

మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల వెంకటయ్య–స్వర్ణ దంపతుల పెద్ద కుమారుడు రామ్‌చరణ్‌(17) డిగ్రీ చదువుతున్నాడు. వీరు వ్యవసాయ కూలీలు.. వారికి చిన్న కుమారుడు ఉన్నాడు. రామ్‌చరణ్‌ మృతిచెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం అలుముకుంది.

అన్నా.. అంటూ నీటిలోకి..

పట్టి వెంకట్‌స్వామి చిన్న కుమారుడు శివమనోజ్‌ నీటిలోకి దిగి అన్నా..అన్నా అని పిలుస్తూ లోతుకు జారుకుంటున్నాడు. ఆక్రమంలో ఒడ్డున ఉన్న అన్న మధుసూదన్‌ తమ్ముడిని పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నం చేసి అతడు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పట్టి మధుసూదన్‌ను కాపాడే ప్రయత్నంలో పట్టి శివమణి(18) కూడా నీటిలోకి దిగి చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డాడు.

సెల్ఫీలతోనే..

ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగారు. ఆ క్రమంలోనే జారి లోతు ప్రవాహంలో పడినట్లు తెలిసింది. దీంతో ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు అంతా గల్లంతై మృత్యువాత పడ్డారని తెలిసింది.

ముమ్మర గాలింపు..

ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5 నుంచి 12 గంటల వరకు రెస్క్యూ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. భూపాలపల్లి ఏఎస్పీ నరేష్‌కుమార్‌, కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, డీడీఆర్‌ఎఫ్‌, ఫైర్‌, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్‌ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఆరుగురి మృతదేహాలు వెలికి తీశారు. అంబులెన్స్‌ల ద్వారా మహదేవపూర్‌ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా ఆర్తనాదాలతో మార్మోగింది.

రాత్రి ఫలించని రెస్క్యూ ఆపరేషన్‌..

శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఘటన జరగడంతో హుటాహుటిన కదిలిన అధికారులు లైటింగ్‌ ఏర్పాటు చేసి కొంతమేర లోతుకు వెళ్లి పరిశీలించి రాత్రి 11.50గంటలకు వరకు వేచి చూసి నిలిపి వేశారు. శనివారం గోదావరి ప్రవాహం 5,100 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 4,500 క్యూసెక్కులకు తగ్గింది.

రూ.10లక్షలు పరిహారం చెల్లించాలి :

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌

మహదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ పరిశీలించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి వదిలేశారని, నీటిని నిల్వ చేసి కాపలా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. ఆరుగురు మృతి ఘటనకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబే కారణమని ఆరోపించారు.

7 గంటల్లో ఇలా..

ఆదివారం ఉదయం 5గంటలకు రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభమైంది. మొదట 5.41 గంటలకు తొగరి రక్షిత్‌, 6.50 గంటలకు పసుల రాహుల్‌, 9.45 గంటలకు కర్ణాల సాగర్‌, 10.07 గంటలకు మధుసూదన్‌, 11.16 గంటలకు రామ్‌చరణ్‌, 11.45 గంటలకు శివమనోజ్‌ మృతదేహాలను వెలికితీశారు. ఏఎస్పీ నరేశ్‌కుమార్‌, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సైలు పవన్‌కుమార్‌ పర్యవేక్షించారు. మృతదేహాలను అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ పరిశీలించారు. ఆయన వెంట డీటీ కృష్ణ, ఆర్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి, ఇరిగేషన్‌ డీఈ సురేశ్‌ ఉన్నారు.

అన్నీ కూలీ కుటుంబాలే..

అంబట్‌పల్లికి చెందిన పట్టి వెంకట్‌స్వామి–యశోద దంపతులకు ఇద్దరు కుమారులు పట్టి మధుసూదన్‌(18) డిగ్రీ, చిన్నకుమారుడు పట్టి శివమనోజ్‌(15) (పదో తరగతి పూర్తి), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆటో నడుపుతూ.. వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాడు. ఇద్దరు కుమారులు కళ్ల ముందే నీటిలో మునిగి కొట్టుకుపోతుండగా రక్షించే ప్రయత్నం చేసినా ఫలించకపోవడంతో ఇద్దరు మృతిచెందారు. పిల్లల చెప్పులు, బెల్టులు పట్టుకొని తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.

ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

తెల్లవారుజామున 5 నుంచి

మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపు

మృతులందరివీ సాధారణ

కూలీ కుటుంబాలే

తల్లిదండ్రుల రోదనలతో

దద్దరిల్లిన బ్యారేజీ పరిసర ప్రాంతాలు

ప్రాణాలు తీసిన ఈత సరదా..

సెల్ఫీలపై ఆసక్తి!

వివాహ వేడుకలకు వచ్చి..

మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల శ్రీనివాస్‌–లక్ష్మీ దంపతుల చిన్న కుమారుడు రాహుల్‌(19) డిగ్రీ చదువుతున్నాడు. వివాహ వేడుకలకు వచ్చి రాహుల్‌ మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. వారు కూడా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

రెస్క్యూ.. సెవెన్‌ అవర్స్‌!1
1/2

రెస్క్యూ.. సెవెన్‌ అవర్స్‌!

రెస్క్యూ.. సెవెన్‌ అవర్స్‌!2
2/2

రెస్క్యూ.. సెవెన్‌ అవర్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement