‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి! | - | Sakshi
Sakshi News home page

‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి!

Jun 9 2025 7:47 AM | Updated on Jun 9 2025 7:47 AM

‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి!

‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి!

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ఓరుగల్లు నేతలకు ఆదివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో మూడో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిన సీనియర్ల ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఉమ్మడి వరంగల్‌ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కొండా సురేఖ, ధనసరి సీతక్కలకు రేవంత్‌రెడ్డి కేబినేట్‌లో స్థానం దక్కింది. సుమారు 16 నెలల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మూడో మంత్రి కోసం పలువురు సీనియర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఆశావహులకు నిరాశ

మంత్రివర్గ విస్తరణ చాలా కాలం నుంచి వాయిదా పడుతుండగా.. చివరకు శుక్రవారం పార్టీ హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. ఇలా ఎవరికి తోచిన దారిలో వారు అగ్రనేతలతో ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఈసారి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. 2014లో టికెట్‌ దక్కకున్నా ఇండిపెండెంట్‌గా గెలుపొందిన మాధవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకే ప్రాధాన్యత ఇచ్చారు. 2023లో కాంగ్రెస్‌ టికెట్‌పైన గెలిచిన ఈయనకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినా జరగలేదు. ఈసారి కూడా తనకు మంత్రివర్గంలో చోటివ్వాలని కోరినా దక్కలేదు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీని వదలకుండా ఉన్న తనకు కూడా అవకాశం ఇవ్వాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ పెద్దలకు తన వాయిస్‌ వినిపించారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు ఎస్సీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని అడిగినట్లు ప్రచారం. అయితే ఉమ్మడి వరంగల్‌ నుంచి ఆశించిన ఎవరికీ అమాత్యపదవి దక్కక పోవడం కొంత నిరాశ పర్చింది.

అమాత్యుల శాఖలు పదిలం

మంత్రివర్గ విస్తరణలో ఈసారి కనీసం నలుగురికి అవకాశం ఉంటుందని భావించినా.. ముగ్గురికే అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన మరో ఎమ్మెల్యే, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రామచంద్రునాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రానున్న కాలంలో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌ పదవితో సరిపెట్టినట్లు సమాచారం. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విస్తరణ సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులకు చెందిన శాఖల మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం మంత్రి సీతక్క పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి(గ్రామీణ నీటిసరఫరా సహా), మహిళా శిశుసంక్షేమ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు ఆదివారం రాత్రి వరకు శాఖలు కేటాయించలేదు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరగలేదు. దీంతో మంత్రుల శాఖలు మారతాయనేది ఉత్త ప్రచారమని తేలిపోయింది.

ఫలించని ఓరుగల్లు సీనియర్‌ నేతల ప్రయత్నాలు

డిప్యూటీ స్పీకర్‌తోనే సరిపెట్టిన

పార్టీ అధిష్టానం

విప్‌ నుంచి డిప్యూటీ స్పీకర్‌గా

రామచంద్రునాయక్‌

శాఖలను పదిలం చేసుకున్న

మహిళా మంత్రులు

ఊహాగానాలకు తెర దింపిన

హైకమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement