
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
ములుగు రూరల్: జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా విజయవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అటవీశాఖ అధి కారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్రావుతో కలిసి అటవీ, డీఆర్డీఓ, నీటిపారుదల, వ్యవసాయం, హార్టికల్చర్, విద్యాశాఖ, మున్సిపల్, పట్టణ అభివృద్ధి అధికారులు, పోలీసులు, పశుసంవర్ధక, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువు, సమతుల్య వాతావరణం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రైతులు పొలం గట్లపై మొక్కలు పెంచుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.