విజయ్‌తో సినిమా.. ఆస్తులన్నీ అమ్ముకున్నా: నిర్మాత | Producer PT Selvakumar Shocking Comments On Vijay | Sakshi
Sakshi News home page

నేను ఆస్తులు అమ్ముకుంటే.. ఆయన మాత్రం రెట్టింపు పారితోషికం.. విజయ్‌పై నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Aug 26 2025 5:12 PM | Updated on Aug 26 2025 5:40 PM

Producer PT Selvakumar Shocking Comments On Vijay

దళపతి విజయ్‌(Vijay)పై ఆయన మాజీ మేనేజర్‌, ‘పులి’ నిర్మాత పీటీ సెల్వకుమార్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘పులి’ సినిమాతో తాను భారీగా నష్టపోతే.. ఆయన రెమ్యునరేషన్‌ మాత్రం డబుల్‌ అయిందన్నారు. సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్న తనకు.. ఈ రోజు వరకు విజయ్‌ నుంచి ఓదార్పు మాట రాలేదన్నారు. 

విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో 2015లో  పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్  నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన తమిళ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై..తొలి రోజే డిజాస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది. దీంతో నిర్మాలతకు, బయ్యర్లుకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత నిర్మాత సెల్వకుమార్‌ ఈ సినిమాపై స్పందించారు.

రిలీజ్‌కి ముందే కుట్ర..
ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని సినిమాను విడుదల చేశాం. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు దాడి చేశారు. ఇది పక్కా ప్లాన్‌ ప్రకారం జరిగింది. నా పక్కన ఉన్నవారే కుట్ర చేశారు. సినిమా విడుదల కాదనే వార్తలను వ్యాప్తి చేశారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న అవమానం, ఒత్తిడి వర్ణనాతీతం. నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఈ ఒక్క సినిమా కోసమే ఖర్చు చేశా.  నా కలలతో ముందుకు సాగాలని కోరుకున్నాను. కానీ ఆ కష్టార్జితం నాశనమైంది.

మధ్యలో బయటకు వచ్చేశారు
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమాను థియేటర్స్‌కి తీసుకొచ్చాం.  తొలి రోజు నెగెటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. స్టోరీ, గ్రాఫిక్స్‌ వర్క్‌పై ఫ్యాన్స్‌ సైతం ఫైర్‌ అయ్యారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్స్‌ నుంచి బయటకు వెళ్లడం కళ్లారా చూశాను. అప్పుడు నా స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే వాళ్లు.

విజయ్‌ దూరం పెట్టాడు.. 
సినిమా అపజయం చెందడంతో విజయ్‌ నన్ను దూరం పెట్టేశాడు. సినిమా రిలీజ్‌ తర్వాత ఐదారు రోజుల పాటు విజయ్‌తో మాట్లాడే అవకాశం రాలేదు. ఈ అపజయం విజయ్‌ కెరీర్‌పై కొంచెం కూడా పడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పారితోషికం డబుల్‌ అయింది. పులి చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకున్న విజయ్‌.. ఆ తర్వాత చిత్రానికి రూ. 45 కోట్ల రెమ్యునరేషన్‌ పుచ్చుకున్నాడు. కానీ వాళ్లు మాత్రం నన్ను దేశ ద్రోహిగా, వైఫల్యం చెందిన వ్యక్తిగానే చూశారు. కొన్ని విషయాలను బయటపెట్టలేను కానీ.. పులి సినిమాతో నా 27 ఏళ్ల కల, కృషి నాశనం అయ్యాయి’ అని ఓ ఈవెంట్‌లో సెల్వకుమార్‌ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. 

Advertisement
 
Advertisement
Advertisement