
రోగులకు మెరుగైన వైద్య సేవలు
కలెక్టర్ రాహుల్రాజ్
ఎంపీ నిధులతో బోర్ల తవ్వకాలు: ఎంపీ షెట్కార్
రామాయంపేట(మెదక్): జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను, ప్రగతి ధర్మారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు అందుతున్న వైద్య సేవలను విస్తృత పర్చాలని, ఈ మేరకు ఆస్పత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పనితీరును సీసీ కెమెరాల ద్వారా నిత్యం మానిటరింగ్ చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది విధులకు హాజరవుతూ రోగులకు వైద్యసేవలు అందజేస్తున్నారని కొనియాడారు. రామాయంపేట, కౌడిపల్లి, ఇతర ఆస్పత్రుల్లో త్వరలో పూర్తిస్థాయిలో సిబ్బంది, డాక్టర్లను నియమిస్తామని వెల్లడించారు. తూప్రాన్, రామాయంపేట పరిధిలో జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, త్వరలోనే ట్రామా కేంద్రం ఏర్పాటయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. కలెక్టర్ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.
బియ్యం సక్రమంగా ఇస్తున్నారా?
మండలంలోని అక్కన్నపేటలో ఆదివారం రేషన్ దుకాణాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా మూడు నెలల బియ్యాన్ని డీలర్ సక్రమంగా ఇస్తున్నారా..? అని వినియోగదారులను ప్రశ్నించారు. అనంతరం బియ్యం నాణ్యత విషయమై ఆరా తీశారు. ఈ–పాస్ డివైస్లో కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ పనితీరు గురించి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బియ్యం పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు.
నారాయణఖేడ్: తాగునీటి సమస్య పరిష్కారానికి పలు గ్రామాలు, తండాలకు బోర్ల తవ్వకం కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తనకోటా నిధుల ద్వారా ఒక్కోచోట బోరు తవ్వకం, మోటారు బిగించడం, పైపులైను ఏర్పాటు పనులకోసం రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. ఆదివారం ఖేడ్ మండలం స్కూల్ తండా, హన్మాన్ తండాలతోపాటు మనూరు మండలం రాణాపూర్ గ్రామంలో బోర్ల తవ్వకాలను ఆయా తండాల పెద్దలు, గ్రామస్తులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆయా తండాల వాసులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు